ఎంఈవో-2 పోస్టుల మంజూరు ఎప్పుడో?

ABN , First Publish Date - 2023-06-03T00:36:56+05:30 IST

మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్‌ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు.

ఎంఈవో-2 పోస్టుల మంజూరు ఎప్పుడో?

అమలుకాని విద్యాశాఖ మంత్రి హామీ

ఉత్తర్వుల కోసం టీచర్ల ఎదురుచూపులు

ఒంగోలు (విద్య), జూన్‌ 2 : మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్‌ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు. ఎంఈవో-2 పోస్టులు మంజూరుచేస్తే అదనంగా మరో 112 మందికి ఉద్యోగోన్నతి లభిస్తుందని ఎదురుచూస్తున్న టీచర్లకు నిరాశే మిగిలింది. ఈ పోస్టుల మంజూరుకు సంబంధించి 12 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నాయకులు జరిపిన చర్చల్లో ఆయన సానుకూలంగా స్పందించినా నేటికీ ఉత్తర్వులు విడుదల కాలేదు. పోస్టుల మంజూరుతోపాటు ప్రస్తుత ఉద్యోగోన్నతుల్లోనే వీటిని భర్తీ చేస్తామని చెప్పినా ఇంతవరకూ అడుగు ముందుకు పడలేదు. ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆమేరకు గత ఏడాది రెండో పోస్టు మంజూరు చేసింది. ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎంఈవో-1 పరిపాలనకు సంబంధించి, ఎంఈవో-2 అకడమిక్‌ వ్యవహారాలు చూసుకుంటారని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో బ్రేకులు పడ్డాయి. తర్వాత వారు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. ఎంఈవో-2ను కేవలం జడ్పీ యాజయాన్యంలోని స్కూలు అసిస్టెంట్లు, హెచ్‌ఎంలతో భర్తీచేస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లాలోని 56 మండలాలకు 56 ఎంఈవో పోస్టులు మంజూరైతే జిల్లాలో అదనంగా 112మందికి ఉద్యోగోన్నతి లభిస్తుంది. 56 మంది హెచ్‌ఎంలను ఆ పోస్టుల్లో నియమిస్తే ఆమేరకు అవి ఖాళీ అవుతాయి. ఆ స్థానాలకు స్కూలు అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతులు లభిస్తాయి. ఆ అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2023-06-03T00:36:56+05:30 IST