విద్యార్థులు క్రీడలలో రాణించాలి

ABN , First Publish Date - 2023-09-26T00:38:46+05:30 IST

విద్యార్థులు క్రీడలలో రాణించాలని మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అన్నారు.

విద్యార్థులు క్రీడలలో రాణించాలి

మార్కాపురం వన్‌టౌన్‌, సెప్టెంబరు 25: విద్యార్థులు క్రీడలలో రాణించాలని మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్‌ స్పోర్ట్స్‌ పోటీలు నియోజక వర్గ స్థాయిలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు తో పాటు క్రీడలు అవసరమన్నారు. క్రీడాకారులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ పీ.అరుణ, ఎంఈవో రాందాస్‌నాయక్‌, ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఎస్‌జీఎఫ్‌ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ జాహ్నవి ప్రియ, పీఈటీలు షకీలా, మంత్రునాయక్‌, కృష్ణాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందనలు

పెద్ద దోర్నాల : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి క్విజ్‌, వ్యాసరచన నృత్యం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బంది సోమ వారం అభినందించారు. మార్కాపురంలో ఈ నెల 23న నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీహెచ్‌ గాయత్రీ, షేక్‌ మాజ్‌ల బృందం క్విజ్‌, వ్యాసరచన, డ్యాన్స్‌పోటీల్లో తృతీయ స్థానంలో గెలుపొంది కలెక్టర్‌ చేతులమీదుగా రూ.5,000లు నగదు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ప్రధానోఫాధ్యాయులు ఎస్‌వీ నారాయణరెడ్డి, ఉఫాధ్యాయులు కిరణ్‌కుమార్‌, చందు, వి.నాగమూర్తి తదితరులు అభినందించారు.

గిద్దలూరు : స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆదర్శ బీఈడీ కళాశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి జడ్పీ స్కూల్‌ విద్యార్థుల పరుగు పందెం నిర్వహించారు. సీవీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చేరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఈ పోటీని ప్రారంభించారు. ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఆయన భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు రంగస్వామిరెడ్డి, రమణరెడ్డి, శేఖర్‌రెడ్డి, రామచంద్రరెడ్డి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు.

త్రిపురాంతకం : ఒంగోలులో ఈ నెల 24న నిర్వహించిన స్కూల్‌గేమ్స్‌ పోటీలలో అండర్‌-17 యోగా విభాగంలో మండలంలోని గొల్లపల్లి జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఓబులరెడ్డి వెంకట రేణుక ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికైంది. త్వరలో పశ్చిమగోదావరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు పాఠశాల పీడీ ఎస్‌.రాధ తెలిపారు. ఈ సందర్భంగా రేణుకను, పీడీ రాధను పాఠశాల హెచ్‌ఎం టి.దీప్తి, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : స్థానిక కమలా పాఠశాల విద్యార్థిని సిరిచందన జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. పాఠశాలలో సిరిచందనను అభినందించి కరస్పాండెంట్‌ పవన్‌, ప్రిన్సిపాల్‌ పుల్లయ్యలు మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అండర్‌-15 షార్ట్‌ ఫుట్‌ పోటీలలో కమలా పాఠశాల విద్యార్థి సిరి చందన ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైయిందని తెలిపారు. పీఈటీ జీవానంద్‌ ను అభినందించారు.

Updated Date - 2023-09-26T00:38:46+05:30 IST