ఓట్ల నమోదుకు స్పెషల్ క్యాంపులు
ABN , First Publish Date - 2023-12-03T00:49:10+05:30 IST
జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక క్యాంపులను శనివారం నిర్వహించారు,
జిల్లావ్యాప్తంగా పాల్గొన్న బీఎల్వోలు
ఒంగోలులో పరిశీలించిన ఆర్డీవో
ఒంగోలు (కలెక్టరేట్), డిసెంబరు 2 : జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక క్యాంపులను శనివారం నిర్వహించారు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ దినేష్కుమార్ సూచనలతో జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండి కొత్తగా ఓట్ల నమోదుతో పాటు చేర్పులు, మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, మండల తహసీల్దార్లు ఆయా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బీఎల్వోలకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఆర్డీవో విశ్వేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కమ్మపాలెం, టీకే బాయిస్ ఎలిమెంటరీ స్కూలు, ఏబీఎం కాలేజీ, రామనగర్లోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడి బీఎల్వోలతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఒంగోలు తహసీల్దార్ మురళి స్థానిక మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. కాగా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఓట్ల జాబితాలో నెలకొన్న అవకతవకలు, డబుల్ ఎంట్రీలు, ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తదితర వివరాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఫిర్యాదులు చేశారు. జిల్లావ్యాప్తంగా 2,183 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగగా ఫాం-6లు 2,320, ఫాం-7లు 1,077, ఫాం-8లు 1980 అందాయి.