సిట్డౌన్
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:56 PM
ఒంగోలులో చోటుచేసుకున్న భూదందాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ స్పీడు తగ్గింది. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు నెమ్మదించింది. తొలుత 140 కేసులు నమోదు చేసి 50 మందిని అరెస్టు చేసి జైలుకు పంపడం, మరో 70 మందిని నిందితులుగా గుర్తించడంతో బాధితులకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం సిట్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా వస్తున్న ఫిర్యాదులపై పెద్దగా స్పందించకపోవడం, ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం అందుకు కారణమైంది. మరోవైపు సిట్లో పనిచేసిన అధికారులు వారి కార్యస్థానాలకు వెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ పరిధిలో వీఆర్లో ఉండి ఇక్కడ విచారణ కోసం వచ్చిన సీఐలు సైతం తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్రసుత్తం భూదందాలకు సంబంధించిన కేసులు నమోదు కావడం లేదు. అదేక్రమంలో దర్యాప్తు కూడా మందకొడిగా సాగుతోంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుందా? అన్న సంశయం కలుగుతోంది.
కొత్త కేసుల నమోదులో జాప్యం
నెమ్మదించిన దర్యాప్తు
నేటికీ పరారీలోనే 10 మంది సూత్రధారులు
కార్యస్థానాల్లో విధులకు తిరిగి వెళ్లిన పోలీసు అధికారులు
బాధితుల్లో అనేక అనుమానాలు
ఒంగోలులో చోటుచేసుకున్న భూదందాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ స్పీడు తగ్గింది. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు నెమ్మదించింది. తొలుత 140 కేసులు నమోదు చేసి 50 మందిని అరెస్టు చేసి జైలుకు పంపడం, మరో 70 మందిని నిందితులుగా గుర్తించడంతో బాధితులకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం సిట్ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. కొత్తగా వస్తున్న ఫిర్యాదులపై పెద్దగా స్పందించకపోవడం, ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం అందుకు కారణమైంది. మరోవైపు సిట్లో పనిచేసిన అధికారులు వారి కార్యస్థానాలకు వెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ పరిధిలో వీఆర్లో ఉండి ఇక్కడ విచారణ కోసం వచ్చిన సీఐలు సైతం తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్రసుత్తం భూదందాలకు సంబంధించిన కేసులు నమోదు కావడం లేదు. అదేక్రమంలో దర్యాప్తు కూడా మందకొడిగా సాగుతోంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుందా? అన్న సంశయం కలుగుతోంది.
ఒంగోలు (క్రైం), డిసెంబరు 17 : ఒంగోలులో నకిలీ పత్రాలు, స్టాంపులతో జరిగిన భూదందాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సిట్ నిన్నమొన్నటి వరకూ కేసులు, అరెస్టులతో హడావుడి చేసింది. కానీ కొద్దిరోజులుగా ఉన్నట్లుండి దూకుడు తగ్గించింది. కీలక సూత్రధారుల అరెస్టుల్లో వైఫల్యం కనిపిస్తోంది. నకిలీ డాక్యుమెంట్లు అని స్పష్టమైనప్పటికీ కొన్ని ఫిర్యాదులకు సంబంధించి కేసుల నమోదు విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఇప్పటి వరకు సిట్ అధికారులు నమోదు చేసిన 140 కేసులలో బాధితులకు భరోసా కలుగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఓ ఇంటిపై పోలీసుల దాడితో కదిలిన డొంక
ఒంగోలు లాయర్పేట ఎక్స్టెన్షన్లోని చీతిరాల పూర్ణచంద్రరావు ఇంటిపై సెప్టెంబర్ 26న పోలీసులు దాడి చేయడంతో భూఅక్రమాల డొంక కదిలింది. అక్కడ భారీగా నకిలీ డాక్యుమెంట్లు, ఖాళీ స్టాంపు పేపర్లు, వివిధ కార్యాలయాలు, అధికారుల స్టాంపులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు దొరికాయి. నలుగురుని అరెస్టు చేసి విచారించగా వారు పెద్దఎత్తున భూదందాలు సాగించినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు అక్టోబర్ 10న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. అనంతరం సిట్ స్పీడుగా ముందుకు వెళ్లింది. ఇప్పటి వరకూ సుమారు 50 మందికిపైగా అరెస్టు చేసి జైలుకు పంపించింది. మరో 70 మంది నిందితులను సిట్ గుర్తించినప్పటికీ వారిని ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. నకిలీ పత్రాలతో భూములు కాజేసిన వ్యవహారాల్లో కీలక సూత్రధారులైన సుమారు 10 మందికి పైగా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.
పరారీలో సూత్రధారులు
భూదందాలలో సాక్షి సంతకాలు చేసిన కొందరిని కూడా సిట్ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే అనేక కేసులలో సూత్రధారులుగా ఉన్న వారు మాత్రం పరారీలో ఉండటం చర్చనీయాంశమైంది. కందుకూరు నుంచి విజయవాడ విమానాశ్రయం వరకు 100 ఎకరాలకు నకిలీ వీలునామా రాయించుకొని అనేక మందిని మోసం చేసిన రెడ్డిపోగు గురయ్య ఎక్కడున్నాడు? ఆయన్ను అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరోవైపు అనేక భూదందాల కేసుల్లో నిందితుడిగా ఉన్న కోటిరెడ్డిని తొలుత సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారు. ఆయనపై బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో వెంటనే బెయిల్పై బయటకు వచ్చారు. ఆతర్వాత కోటిరెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి. అప్పటికే ఆయన పలాయనం చిత్తగించాడు. అంతేకాదు ఇంకా సుమారు పది మంది ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ స్పీడు తగ్గించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మేయర్ భర్తపై కేసు నమోదులో మీనమేషాలు
రెవెన్యూ రికార్డుల ప్రకారం మండువవారిపాలెం రైతులకు సంబంధించి త్రోవగుంట సర్వేనంబర్ 494లో 2.52 ఎకరాల భూమి ఉంది. అయితే ఎలాంటి సబ్ డివిజన్ కాకుండానే, అంత మొత్తం భూమి లేకుండానే 494/3బీలో 14 ఎకరాలు అద్దంకికి చెందిన శ్రీనివాసరావు ఒంగోలు మేయర్ భర్త అరుళ్రాజ్, వారి అనుచరుడు ప్రభుదా్సకు పవర్ అఫ్అటార్నీ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేశారు. దాన్ని చేసిన అప్పటి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అయిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణమోహన్ను ఆశాఖ ఉన్నతాధికారులు అధికారులు సస్పెండ్ చేశారు. రిజిస్ట్రేషన్ నకిలీ పత్రాలతో జరిగిందని గుర్తించి వారు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. అయితే నకిలీ పత్రాలను ఎవరు తయారు చేశారు, ఎవరు దాఖలు చేశారన్నది ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు. సిట్ అధికారులు మాత్రం ఇంకా రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అసలు నకిలీ పత్రాల వ్యవహారంలో తొలుత పట్టుబడిన కీలక సూత్రధారి పూర్ణచంద్రరావు వద్ద దొరికిన 52 డాక్యుమెంట్లు నకిలీవని తేల్చి అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులు సిట్కు ఫిర్యాదులు చేశారు. ఈమేరకు ఆయతోపాటు మరికొందరిపై అయా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అయితే మేయర్ భర్త అరుళ్రాజ్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్లో నకిలీ పత్రాలు ఉన్నట్లు గుర్తించిన రిజిస్ట్రేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, అదేవిధంగా సిట్ అధికారులు కూడా ఈ వ్యవహారంలో మిన్నకుండిపోయారు. ప్రస్తుతం వచ్చే భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులపై కేసుల నమోదులో కాలయాపన చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
బాధితులకు భరోసా ఎంత?
భూదందాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే కలెక్టర్ దినే్షకుమార్, ఎస్పీ మలికగర్గ్ వేగంగా స్పందించారు. సిట్ను ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలిచేందుకు 140 కేసుల వరకూ నమోదు చేయించారు. వాటిలో కొన్నింటికి సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని కేసుల్లో నిందితులను ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడం, దర్యాప్తు నెమ్మదించడంతో బాధితులకు ఏమేరకు భరోసా కలుగుతుందన్న సందేహం కలుగుతోంది. ఈ కేసులు ఎప్పటికి పరిష్కారమవుతాయి? తమ ఆస్తులు తిరిగి దక్కుతాయా? అన్న మీమాంసలో బాధితులు ఉన్నారు.
కార్యస్థానాలకు సిట్ అధికారులు
భూదందాలపై రెండు నెలలపాటు హడావుడి చేసిన సిట్ ప్రస్తుతం వేగం తగ్గించింది. ప్రత్యేక దర్యాప్తు బృందంలో పనిచేసే అధికారులు వారి కార్యస్థానాలకు వెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ పరిధిలో వీఆర్లో ఉండి ఇక్కడ విచారణ కోసం నియమితులైన సీఐలు సైతం తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్రసుత్తం భూదందాలకు సంబంధించిన కేసులు నమోదు కావడం లేదు. అదేక్రమంలో నమోదైన కేసుల దర్యాప్తు కూడా మందకొడిగా సాగుతోంది.