శంకర్దాదాలు...
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:59 AM
వాళ్లు ఆర్ఎంపీ డాక్టర్లు. కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సిన వారు బహిరంగంగానే వైద్యశాలలను నడుపుతున్నారు.
.నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు నిర్వహిస్తున్న ఆర్ఎంపీలు
క్లినిక్లలోనే పడకలు
అనుబంధంగా ల్యాబ్లు, మెడికల్ షాపులు
కొండపిలో డీఎంహెచ్వో తనిఖీల్లో బయటపడిన విస్తుపోయే నిజాలు
పలువురికి నోటీసులు
క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
కొండపి, డిసెంబరు 16 : వాళ్లు ఆర్ఎంపీ డాక్టర్లు. కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సిన వారు బహిరంగంగానే వైద్యశాలలను నడుపుతున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా పడకలు ఏర్పాటు చేయడంతోపాటు వైద్యశాలలకు అనుబంధంగా ల్యాబ్లు, మెడి కల్ షాపులు నిర్వహిస్తున్నారు. అర్హత పట్టా లేకుండా జనం నాడిపట్టి వైద్యాన్ని వ్యాపారంగా మార్చారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విస్తుపోయే నిజం కొండపిలో డీఎంహెచ్వో రాజ్యలక్ష్మి శనివారం చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. వారు ఏర్పాటు చేసిన బోర్డులపై పేరు ముందు ఎంఆర్ (మిస్టర్) అని రాయడం, దానిపైనే స్కానింగ్ మిషన్లు, చిన్నారుల ఫొటోలు, గుండె, కిడ్నీ పరీక్షల చేస్తామని పేర్కొనడం చూసి ఆమె అవాక్కయ్యారు. కొందరికి అక్కడికక్కడే నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఓ ఎంబీబీఎస్ డాక్టర్ నిర్వహిస్తున్న వైద్యశాలలోనూ అనేక లోపాలను ఆమె గుర్తించారు. ఆయనకు కూడా నోటీసు ఇచ్చారు.
ఆసుపత్రుల్లా క్లినిక్లు
డీఎంహెచ్వో రాజ్యలక్ష్మి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్లను సందర్శించారు. అక్కడ మూడు చోట్ల పడకలు ఉండటం, వాటికి అనుబంధంగా ల్యాబ్లు, మెడికల్ షాపులు నిర్వహిస్తుండటాన్ని ఆమె గమనించారు. ఈ విషయమై ఆర్ఎంపీలను ప్రశ్నించారు. అవసరమైన సర్టిఫికెట్లను చూపించాలని కోరారు. అయితే కొందరు అర్హత కలిగిన వారి నుంచి సర్టిఫికెట్లు తీసుకొని వాటితో అనర్హుల ద్వారా ల్యాబ్లు, మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిని మందలించారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎంహెచ్వో తనిఖీ సమాచారంతో పలువురు ఆర్ఎంపీలు, ప్రైవేటు ల్యాబ్లు, మెడికల్ షాపుల నిర్వాహకులు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు.
అనుమతి లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యశాల నిర్వహణ
కొండపిలోని పొదిలి రోడ్డులో ఓ ఎంబీబీ ఎస్ డాక్టర్ నిర్వహిస్తున్న వైద్య శాలను డీఎంహెచ్వో రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. డాక్టర్ తెలంగాణలో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నానని చెప్పడంతో, మరి ఇక్కడ ఎలా వైద్యం చేస్తారు? అని ఆమె ప్రశ్నించారు. లెటర్ ప్యాడ్పై పేరు చివరన స్పెషలైజేషన్లు ఎలా రాసుకున్నారని ఆమె నిలదీశారు. వైద్యశాలలో గైనకాలజిస్ట్ బోర్డు చూసి ఆమె ఎవరన్నారు. ప్రైవేటు డాక్టర్ అని చెప్పడంతో ఏ వైద్యశాలలో పనిచేస్తారని డీఎంహెచ్వో అడిగారు. ఆమె ఇంటిలోనే వైద్యం చేస్తుంటారని బదులిచ్చారు. వైద్యశాలలోని మెడికల్ షాపును ఆమె తనిఖీ చేశారు. ఈ సమయంలో ఆ వైద్యుడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మెడికల్ షాపులో పచారీ కొట్లో సరుకుల మాదిరిగా మందుల అమ్మకం వివరాలు రోజు వారీగా బుక్లో రాయడాన్ని డీఎంహెచ్వో గుర్తించారు. దాన్ని తన సిబ్బందితో ఫొటో తీయించారు. అనంతరం డాక్టర్ వచ్చి తాను వేరే వైద్యుడి వద్ద వైద్యశాలను లీజుకు తీసుకున్నానని చెప్పి కొన్ని సర్టిఫికెట్లను సెల్ఫోన్లో చూపించారు. ఆ తర్వాత ఆమె వైద్యశాలలో గుర్తించిన లోపాలను పేర్కొంటూ వైద్యుడికి అక్కడికక్కడే నోటీసు ఇచ్చారు.
పీహెచ్సీ సిబ్బందిపై మండిపాటు
అన్ని గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు ఉన్నా రోగులు ప్రైవేటు వైద్యశాలలకు ఎందుకు వెళుతున్నారని ఈ సందర్భంగా డీఎంహెచ్వో తన వెంట ఉన్న పెట్లూరు పీహెచ్సీ సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యశాలల్లో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మీరు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఇచ్చామని సిబ్బంది చెప్పడంతో ఎప్పుడు ఇచ్చారు.. ఇక్కడ వైద్యం జరుగు తుందా? వైద్యం పేరుతో ప్రైవేటు వ్యక్తుల దోపిడీ జరుగు తుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మీడియాతో మాట్లాడుతూ గుర్తించిన విషయాలపై ఆయా వైద్యశాలల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అర్హత లేకుండా వైద్యం, రక్తపరీక్షలు, ఇతర పరీక్షలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.