జాతీయస్థాయి ప్రదర్శనకు జిల్లా ప్రాజెక్టు ఎంపిక
ABN , First Publish Date - 2023-03-26T00:44:25+05:30 IST
జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలకు జిల్లా ప్రాజెక్టు ఎంపికైంది. పుల్లలచెరువు జడ్పీ హైస్కూల్ విద్యార్థి నిఖిల్చంద్ ప్రదర్శించిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్వే హెక్సామిషన్ అనే ప్రాజెక్టు అందుకు అర్హత సాధించింది.
పుల్లలచెరువు జడ్పీ హైస్కూల్ విద్యార్థి ఘనత
ఒంగోలు (విద్య), మార్చి 25 : జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలకు జిల్లా ప్రాజెక్టు ఎంపికైంది. పుల్లలచెరువు జడ్పీ హైస్కూల్ విద్యార్థి నిఖిల్చంద్ ప్రదర్శించిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్వే హెక్సామిషన్ అనే ప్రాజెక్టు అందుకు అర్హత సాధించింది. కాకినాడలో ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలు ఆన్లైన్లో జరిగాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మొత్తం 15 ప్రాజెక్టులు ప్రదర్శించగా నిఖిల్చంద్ ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైంది. ఈ మిషన్కు నాలుగు వైపులా నాలుగు హెక్సాబ్లేడ్లను బిగించి నాలుగు వైపులా లైన్లను అమర్చారు. వీటి సహాయంతో పైపులను కానీ, చెక్కలను కానీ మనకు కావాల్సిన కొలతలతో మోటార్ను ఆన్చేయగానే హెక్సాబ్లేడులు కట్ చేస్తాయి. దీని సహాయంతో ఒకేసారి నాలుగు పైపులను కట్ చేయవచ్చు. దీంతో సమయం ఆదా కావడంతోపాటు ఎక్కువమంది అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టు తయారీకి గైడ్ టీచర్గా షేక్ మస్తాన్వలి వ్యవహరించారు. ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో నిఖిల్చంద్ పాల్గొంటారు. నిఖిల్చంద్ను, గైడ్ టీచర్ వలిని, హెచ్ఎంను డీఈవో రమేష్, జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్లు అభినందించారు.