కొత్తూరుకు రాళ్లదారే దిక్కు
ABN , First Publish Date - 2023-06-26T00:32:44+05:30 IST
మండలంలోని మంగళకుంట నుంచి కొత్తూరుకు వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
విస్మరించిన వైసీపీ పాలకులు
తర్లుపాడు, జూన్ 25: మండలంలోని మంగళకుంట నుంచి కొత్తూరుకు వెళ్లే రోడ్డుకు మోక్షమెప్పుడో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మంగళకుంట నుంచి కొత్తూరు వరకు 3 కి.మీ. దూరం ఉంది. దీనికి మెటల్ వేసి తారురోడ్డు వేసేందుకు టీడీపీ ప్రభుత్వంలో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. గతంలో కంకర చేసి చదును చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఆ రోడ్డు ఏర్పాటు పనులను మధ్యలోనే నిలిపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి పట్టించు కొనే నాథుడే లేరు. నాటి నుంచి రాళ్ల తేలిన రోడ్డుపైనే ప్రయాణిస్తూ ప్రయాణికులు నరకయాతన అనుభవి స్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్పటికీ ఫలితం లేదు. ఈ రోడ్డు మీదుగా కొత్తూరు, తాడివారిపల్లెకు నిత్యం ప్రజలు వెళ్తుంటారు. రోడ్డు ఇలా ఉండడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తూరు నుంచి తాడివారిపల్లె వరకు కూడా తారు రోడ్డు వేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించు కున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలు ఈ రహదారి నుంచి వెళ్తుంటారు. ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు ఆన్లైన్లో కనిపించక పోవడం వలన పనులు ఆగిపోయానని, మరోసారి టెండర్లు పిలిస్తేనే ఈ రోడ్డును తారురోడ్డుగా వేయను న్నట్లు పంచాయతీ ఏఈ శ్రీనివాసులు తెలిపారు.