ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’

ABN , First Publish Date - 2023-07-27T02:28:42+05:30 IST

జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వ్యాయామ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

అధికారులు, పీఈటీలకు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ దిశానిర్దేశం

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 26 : జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వ్యాయామ ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం భవన్‌లోని స్పందన హాలులో బుధవారం ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా అధికారులు, పీఈటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 2 నుంచి 4, 5 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోటీలు గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు దశల్లో జరుగుతాయని తెలిపారు. పోటీల్లో 17 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా పాల్గొనవచ్చన్నారు. పోటీలను నిర్వహించేందుకు అవసరమైన మైదానాలను, క్రికెట్‌ పోటీలకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని శాప్‌ విజయవాడ వారు ఏర్పాటు చేసిన యాప్‌లో వివరాలు నమోదు చేసుకునే విధంగా చూడాలన్నారు. గ్రామ స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలు మండల స్థాయికి, అక్కడ గెలిచిన వారు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అక్కడ గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులు, జట్లను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు లోకేశ్వరరావు, జీవీ నారాయణరెడ్డి, రవికుమార్‌, సుబ్బారావు, జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-27T02:28:42+05:30 IST