పొజిషన్ సర్టిఫికేట్లు
ABN , First Publish Date - 2023-08-23T23:01:37+05:30 IST
నివాస స్థలాలకు పొజిషిన్ సర్టిఫికెట్ల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్నిచోట్ల హక్కు కల్గిన వారికి కాకుండా కావాలని ఇతరులకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత స్థలంలో ఎవరు ఉంటున్నారనే విషయాన్ని నిర్ధారించి సబ్ డివిజన్పత్రం మంజూరు చేస్తున్న సర్వేయర్ కొన్నిచోట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో సమస్య జటిలమవుతోంది. స్థలాలకు విపరీతంగా విలువలు పెరగటంతో హక్కు కల్గిన లబ్ధిదారులు రికార్డు క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
దర్శిలో రెవెన్యూ అధికారుల లీలలు
విలువైన స్థలాల విషయంలో వివాదాలు
ముడుపులు తీసుకుని ఇష్టారాజ్యంగా అనుభవస్థితి పత్రాలు
వాటితో రిజిస్ర్టేషన్లు కూడా చేసిన అక్రమార్కులు
క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్న వాస్తవ హక్కుదారులు
దర్శి, ఆగష్టు 23 : నివాస స్థలాలకు పొజిషిన్ సర్టిఫికెట్ల మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్నిచోట్ల హక్కు కల్గిన వారికి కాకుండా కావాలని ఇతరులకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత స్థలంలో ఎవరు ఉంటున్నారనే విషయాన్ని నిర్ధారించి సబ్ డివిజన్పత్రం మంజూరు చేస్తున్న సర్వేయర్ కొన్నిచోట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో సమస్య జటిలమవుతోంది. స్థలాలకు విపరీతంగా విలువలు పెరగటంతో హక్కు కల్గిన లబ్ధిదారులు రికార్డు క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
దర్శి పట్టణం కురిచేడు రోడ్డులోని ఒక స్థలంం రిజిస్ర్టేషన్ ఒకరికి ఉండగా, మరొకరి ఆధీనంలో ఆ స్థలం ఉన్నట్లు సర్వేయర్ సబ్ డివిజన్ చేసి రిపోర్టు ఇచ్చారు. ఆ రిపోర్టు మేరకు రెవెన్యూ అధికారులు వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే అదునుగా సర్టిఫికెట్ తీసుకున్న వ్యక్తులు ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించారు. తొలుత కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ చేసుకున్న వ్యక్తులు ఏం చేయాలో పాలుపోక మదనపడుతున్నారు. నిబంధనల ప్రకారం హక్కు కల్గిన వారి చేత రిజిస్ర్టేషన్ చేయించుకున్నా రికార్డుల్లో లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు డబుల్ రిజిస్ర్టేషన్లు చేయించుకోవటంతో వివాదం ముదురుతోంది.
దర్శి-కురిచేడు రోడ్డులో మరొక స్థలం వివాదం కూడా ఎంతోకాలంగా కొనసాగుతోంది. ఆ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు కొనుగొలు చేయటంతో సమస్య జటిలమైంద. ఆ స్థలం ఎవరికి ఎక్కడ అనే విషయం నిర్ధారించి సబ్ డివిజన్చేయటంలో సర్వేయర్ నిబంధనల ప్రకారం వ్యవహరించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ స్థలం విషయంలో కొందరు కోర్టుకు కూడా వెళ్లారు.
రాజంపల్లిలో ఒక స్థలం హక్కు కల్గిన వారికి కాకుండా ఇతరులకు సబ్ డివిజన్చేసి ఆన్లైన్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న నిజమైన హక్కుదారులు ఇదేమిటని అధికారులను ప్రశ్నించగా నాలుక కరుచుకొని సరిదిద్దుతామని కాలయాపన చేస్తున్నారు. గత ఏడాదిగా హక్కుదారులు కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నా రికార్డులు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని బాధితులు తెలిపారు.
దర్శి పట్టణంలో అనేక చోట్ల నివేశన స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి. ఇదే అదునుగా కొందరు అధికార వైసీపీ నాయకులు విలువైన ప్రభుత్వ స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించుకొని సొంతం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
దర్శి పట్టణంలో ప్రభుత్వ స్ధలాల ఆక్రమణలకు కొందరు ఆక్రమార్కులు అనేకసార్లు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అధికారులు ఇప్పటికైనా స్థలాల విషయంలో, పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు విషయంలో నిబంధనలు పాటించకపోతే గొడవలు పెరిగి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంటుంది.