Share News

ఉరితాళ్లతో మునిసిపల్‌ కార్మికుల నిరసన

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:51 AM

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాల్గో రోజుకు చేరుకుంది.

ఉరితాళ్లతో మునిసిపల్‌ కార్మికుల నిరసన
ఒంగోలులో మెడకు తాళ్లు బిగించుకొని నిరసన తెలుపుతున్న మునిసిపల్‌ కార్మికులు

నాల్గో రోజుకు చేరిన సమ్మె

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 29 : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాల్గో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో కార్మికులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. నగర నాయకురాలు టి.విజయ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో యూనియన్‌ గౌరవాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో మునిసిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దాటవేయడం, హామీల అమలును వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం జగన్‌కే సాధ్యమన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన జగన్‌కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో తంబి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేంసన్‌, యు.రత్నకుమారి, కాకుమాను వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మికాంత్‌, శ్రీలక్ష్మి, కె.మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:51 AM