మొక్కుబడి..!
ABN , First Publish Date - 2023-12-03T23:26:08+05:30 IST
జిల్లాలో ఓట్ల నమోదు, చేర్పులు, మార్పుల కోసం రెండు రోజులపాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మొక్కుబడిగా సాగింది. జిల్లాలోని 2,183 పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో బూత్లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఈ ప్రక్రియను చేపట్టారు.
స్పెషల్ డ్రైవ్కు స్పందన నామమాత్రం
తప్పుల తడకగానే ఓటర్ల జాబితాలు
అవగాహన లేమితో కనిపించని ఓటర్లు
కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి
ఒంగోలు (కలెక్టరేట్), డిసెంబరు 3 : జిల్లాలో ఓట్ల నమోదు, చేర్పులు, మార్పుల కోసం రెండు రోజులపాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మొక్కుబడిగా సాగింది. జిల్లాలోని 2,183 పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో బూత్లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఈ ప్రక్రియను చేపట్టారు. కలెక్టర్ దినే్షకుమార్ ఆదేశాలతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ప్రజల నుంచి ఆశించిన స్పందన కరువైంది. యంత్రాంగం నిర్లక్ష్యానికి తోడు ఓటర్లకు అవగాహన లేకపోవడం అందుకు కారణమైంది. ఏదో మొక్కుబడిగా పోలింగ్ కేంద్రాల్లో జాబితాలు పెట్టుకొని వచ్చిన వారితో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కాలం వెల్లబుచ్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు బీఎల్వోల దృష్టికి తీసుకెళ్లిన డబుల్ ఎంట్రీలు, మృతుల ఓట్లపై చర్యలు తీసుకున్నారే తప్ప మిగిలిన వాటి గురించి పట్టించుకోలేదు. ప్రతిపోలింగ్ కేంద్రంలో డోర్ నెంబర్లు లేనివి, చనిపోయిన వారి ఓట్లు కొల్లలు బయటపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజులు చేపట్టిన స్పెషల్ డ్రైవర్లో పలు పోలింగ్ కేంద్రాల్లో కేవలం బీఎల్వోలు ఉన్నారే తప్ప ఓటర్లు కనీసం ఆవైపు చూడని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ ఆరు మాసాలుగా అనేక చర్యలు చేపడుతున్నా ఓటర్ల జాబితాలో అవే తప్పులు పునరావృతమవుతున్నాయి.
యంత్రాంగం తీరుపై అనుమానాలు
స్పెషల్ డ్రైవ్లో అనేక పోలింగ్ కేంద్రాల వద్ద అఽధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల హడాహుడి కనిపించింది. ఒంగోలు నగరంలోని 80నుంచి 84 వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతుల ఓట్లు సుమారు 70కిపైన, అనుమానాస్పద ఓట్లు మరో 50 వరకు ఉన్నట్లు ప్రతిపక్షాల నేతలు గతంలోనే గుర్తించి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. 9వ డివిజన్లో 100 మందికిపైగా ఓటర్ల అచూకీ లేదు. ఇలా నగరంలో అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉన్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా వేలల్లోనే బోగస్ ఓట్లు ఉన్నా వాటి తొలగింపు విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధిచేకూరే విధంగా బీఎల్వోలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.