వాగుదాటి వెళ్లేదెలా..?

ABN , First Publish Date - 2023-02-11T23:47:10+05:30 IST

ప్రజల చెంతకు పాలన తీసుకువచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. వాటి ద్వారా త్వరితగతిన సేవలందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతుండంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ముద్దపాడు సచివాలయం పరిధిలో నెలకొన్న పరిస్థితి అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పాలేరుకు అవతల సచివాలయ కాంప్లెక్స్‌ నిర్మిస్తుండటంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆర్బీకే ప్రారంభంకాగా రైతులు వాగుదాటి వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు.

వాగుదాటి వెళ్లేదెలా..?
పాలేరువాగు

వైసీపీ నేతల ఒత్తిడితో దారిలేని చోట నిర్మాణం

ఇబ్బందులుపడుతున్న నాలుగు గ్రామాల ప్రజలు

పీసీపల్లి, ఫిబ్రవరి 11 : ప్రజల చెంతకు పాలన తీసుకువచ్చేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. వాటి ద్వారా త్వరితగతిన సేవలందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతుండంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. ముద్దపాడు సచివాలయం పరిధిలో నెలకొన్న పరిస్థితి అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పాలేరుకు అవతల సచివాలయ కాంప్లెక్స్‌ నిర్మిస్తుండటంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆర్బీకే ప్రారంభంకాగా రైతులు వాగుదాటి వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు. మిగిలిన భవనాలు కూడా ప్రారంభిస్తే అన్ని పనులకూ వాగుదాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ముద్దపాడు పంచాయతీ పరిధిలో మర్రికుంటపల్లి, వాకంవారిపల్లి, పెద్దన్నపల్లి, పాతముద్దపాడు, కొత్తముద్దపాడు గ్రామాలు ఉన్నాయి. వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,353 మంది ప్రజలు నివసిస్తున్నారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచీ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా మర్రికుంటపల్లిలో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. అక్కడి నుంచే సిబ్బంది, పాలకవర్గం విధులు నిర్వహిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. ఇదే సమయంలో ముద్దపాడు పంచాయతీలోని 5 గ్రామాలతో పాటు భట్టుపల్లి పంచాయతీలోని చినభట్టుపల్లి, పెదభట్టుపల్లి గ్రామాలను కలిపి ముద్దపాడు సచివాలయంగా ఏర్పాటు చేశారు.

అధికార పార్టీ నేతల ఒత్తిడితో

2000 జనాభాకు ఒక సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాలను నిర్మించతలపెట్టిన వైసీపీ ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణం చేపట్టింది. అన్ని గ్రామాలకు అందుబాటులో పంచాయతీ కార్యాలయం ఉన్న (ప్రస్తుత సచివాలయం నడుస్తున్న) చోట మర్రికుంటపల్లిలో నిర్మించాల్సిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పంచాయతీకి సంబంధించిన కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆరు గ్రామాలకు దూరంగా ఉన్న పాలేరువాగుకు అవతల కొత్తముద్దపాడులో నిర్మిస్తున్నారు. వీటిలో సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌ నిర్మాణ పనులు జరుగుతుండగా రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వాగుకు ఒకవైపు నాలుగు గ్రామాలు, వాగుకు అవతలైన కొత్తముద్దపాడు ఉంటుంది. ఈఏడాది కురిసిన వర్షాలకు పాలేరుకు భారీగా నీరు చేరడంతో వాగు పారుతోంది. పాతముద్దపాడు, వాకంవారిపల్లి, మర్రికుంటపల్లి, పెద్దన్నపల్లి, భట్టుపల్లి గ్రామాల రైతులు ఆర్‌బీకేకు వెళ్లాలంటే వాగును దాటాల్సి వచ్చి అనేక అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసి వాగు పొంగితే కార్యాలయాలకు ఎలా వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా కార్యాలయాలు కూడా ప్రారంభిస్తే సచివాలయం, విలేజ్‌ క్లినిక్‌కు వెళ్లి సేవలు పొందేందుకు ప్రతిసారీ వాగు దాటడం ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏరు దాటే అవకాశం లేనప్పుడు సచివాలయానికి చేరుకోవాలంటే 25కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో కార్యాలయాలు ఉంచి ప్రజలకు సేవలందించేలా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సచివాలయ పరిధి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వాగు దాటి వెళ్లాలంటే ఇబ్బందే

నల్లపనేని రత్తయ్య, ముద్దపాడు మాజీ సర్పంచ్‌

అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో మర్రికుంటపల్లిలో పంచాయతీ కార్యాలయం ఉంది. ప్రస్తుతం సచివాలయం కూడా పంచాయతీ భవనంలోనే ఉంది. ఏపని కావాలన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. సచివాలయ నూతన భవనాలను ఇక్కడే నిర్మిస్తారని అశించాం. కొంతమంది వైసీపీ నాయకులు ఆధిపత్యం కోసం అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో దారిమార్గం లేని పాలేరు వాగుకు అవతల ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారు. పాలేరు వాగులో ఏడాదిలో ఐదారు నెలలు నీరు పారుతుంటుంది. ప్రజలు వాగుదాటి సచివాలయానికి వెళ్లడం కష్టం. లేదంటే వంతెన నిర్మించాలి.

Updated Date - 2023-02-11T23:47:12+05:30 IST