కలగా మిగిలిన గుండ్లకమ్మ లిఫ్ట్
ABN , First Publish Date - 2023-09-26T00:43:02+05:30 IST
త్రిపురాంతకం మండలంలో సాగర్ కాలువ ద్వారా నీరు పారుతున్నా అది కొన్ని గ్రామాలకు అందని ద్రాక్షగానే మారింది.

త్రిపురాంతకం, సెప్టెంబరు 25: త్రిపురాంతకం మండలంలో సాగర్ కాలువ ద్వారా నీరు పారుతున్నా అది కొన్ని గ్రామాలకు అందని ద్రాక్షగానే మారింది. సాగర్ జలాలు అన్ని గ్రామాల్లోని భూములకు అందే పరిస్థితి లేకపోవడంతో మండలంలోని సగానికి పైగా గ్రామాల్లో వర్షాధారిత పంటలను సాగు చేస్తున్నారు. మరికొన్ని భూములను బీడు భూములుగా వదిలేయడం పరిపాటిగా మారింది. ఆ భూముల్లో నీరు పారుతున్నా ఆ నీరు అందక బీడుగా మారుతున్న పొలాలు కూడా ఉన్నాయి. దీనిలో ముడివేముల ప్రాంతం ప్రధానమైనది. దీంతో పక్కనే ఉన్న గుండ్లకమ్మ నదిపై లిఫ్ట్ ఏర్పాటు చేసి తద్వారా సాగు నీటిని అందించాలనే డిమాండుతో ముప్పై ఏళ్లుగా రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు. అప్పట్లోనే రూ.30 కోట్లతో గుండ్లకమ్మ నదిపై ముడివేముల సమీపంలో లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ముడివేముల, పాపన్నపాలెం, ఒడ్డుపాలెం, డీవీఎన్ కాలనీ, గుట్లపల్లి, జి.ఉమ్మడివరం గ్రామాల్లో బీడు భూములైన 3,450 ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వ హ యాంలో నియోజకవర్గ త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో పాత ఫైలును కదిలించారు. ఆ ఫైలు అప్పటి ఉన్నతాధికారులకు, మంత్రులకు చేరింది. వెంటనే కొద్ది కాలానికి రాష్ట్ర ప్రభుత్వం మారింది. అనంతరం దానిని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. లిఫ్ట్ వస్తుందని, సాగు నీరు వస్తాయని, తమ భూముల్లో పంటలు పండుతాయని ఆశపడిన రైతులకు అడియాశలే మిగిలాయి.
మంత్రి పట్టించుకుంటేనే...
నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ మంత్రి కూడా కావడంతో ప్రత్యేక చొరవ చూపితే లిఫ్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, నిర్మాణాన్ని చేపట్టవచ్చని, సాగు జలాలను అందించవచ్చని రైతులు ఆశపడుతున్నారు. కానీ మంత్రి దీనిపై శ్రద్ద చూపడం లేదని, వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.