చంద్రబాబు కోసం...

ABN , First Publish Date - 2023-09-19T23:48:53+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మంగళవారం ఉదయం మార్టూరు మండలంలో బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

చంద్రబాబు కోసం...
పూజలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఏలూరి, స్వామి, అశోక్‌రెడ్డి, బాలాజీ, కొండయ్య తదితరులు

టీడీపీ శ్రేణుల ర్యాలీ

క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ పూజలు

ఇసుకదర్శి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు

పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరితో పాటు ఉమ్మడి ప్రకాశం నేతలు

మార్టూరు, సెప్టెంబరు 19 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మంగళవారం ఉదయం మార్టూరు మండలంలో బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు బీఎన్‌ విజయ్‌కుమార్‌, ఎం.అశోక్‌ రెడ్డి, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎంఎం కొండయ్య, కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ దేవాలయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసిన జగన్‌ ప్రభుత్వం పతనం కావాలని, చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని, కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఏలూరితో పాటు నాయకులు, కార్యకర్తలు ఏలూరి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ స్కాం అవాస్తవం

కొండపి ఎమ్మెల్యే స్వామి

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో స్కిల్‌ డెవల్‌పమెంట్‌లో స్కాం జరిగిందనడం అవాస్తవం. చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపించడం బాధాకరం. సీఎం జగన్‌ భ్రమలలో బతుకుతున్నారు. చంద్రబాబుతోపాటు లోకే్‌షను కూడా అరెస్ట్‌ చేసి తెలుగుదేశం పార్టీని అనాథను చేయాలన్నదే జగన్‌ ఆలోచన. అది నెరవేరదు. అతని కలలు కల్లలుగానే నిలిచిపోతా యి. చంద్రబాబు నిష్కలంగా బయటకు వస్తాడు, న్యా యం గెలుస్తుంది. ధర్మం జయిస్తుందన్న నమ్మకం ఉంది.

కక్ష పూరితంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారు

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ

ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినా్‌షరెడ్డి ఉన్నారని నిర్ధారించిన సీబీఐ కేసులో ఇంతవరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయని పరిస్థితి. రాష్ట్రంలో చట్టం ఉందా, రాజ్యాంగ బద్ధంగా నడుస్తుందా, దౌర్జన్యపూరితంగా నడుస్తున్నదా అని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

చంద్రబాబు అరె్‌స్టతో వైసీపీ పతనం మొదలైంది

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

రాష్ట్రంలో వైసీపీ పాలనలో అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయనడానికి నిదర్శనమే చంద్రబాబును అరెస్ట్‌ చేయడం. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేయడం బాధాకరం. చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారన్న నమ్మకం ఉంది. భగవంతుని ఆశీస్సుల కోసం ఉమ్మడి ప్రకాశం నేతలతో కలిసి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశాం.

టీడీపీ నాయకుల ర్యాలీతో పోలీసుల హడావుడి

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేసిన భారీ ర్యాలీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన నేతలు మార్టూరులో పార్టీ కార్యాలయం వద్ద రిలేదీక్షలు చేస్తున్న నాయకులకు సంఘీభావంగా మళ్లీ ర్యాలీగా వస్తారన్న సమాచారంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. బాపట్ల డీఎ్‌సపీ టి.వెంకటేశ్వర్లు స్వయంగా సీఐ టి.ఫిరోజ్‌, తదితర పోలీసు బందోబస్తుతో ఇసుకదర్శి గ్రామం చేరుకొని వాహనాలను ర్యాలీగా కాకుండా విడివిడిగా వెళ్లాలని సూచించారు. ఈ విషయమై ఏలూరి సాంబశివరావుతో డీఎ్‌సపీ మాట్లాడారు. దాంతో పార్టీ నేతలు అందరూ విడివిడిగా వారి వాహనాలలో ఏలూరి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం, మరలా నాయకులు ర్యాలీ నిర్వహించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మార్టూరులో పార్టీ కార్యాలయంలో మంగళవారం రిలే దీక్షలు చేస్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంఘీభావం ప్రకటించారు. ఆయన కూడా వారితో కలిసి గంటసేపు దీక్షలో కూర్చున్నారు.

Updated Date - 2023-09-19T23:48:53+05:30 IST