వైద్యులు లేక వెలవెల

ABN , First Publish Date - 2023-06-03T01:33:40+05:30 IST

తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో వైద్యశాలకు వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.

వైద్యులు లేక వెలవెల

తర్లుపాడు, జూన్‌ 2: తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో వైద్యశాలకు వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్‌ వైద్యశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక డాక్టర్‌ ఏప్రిల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉన్న మరో వైద్యాధికారిణి ఒంగోలులో సమావేశానికి వెళ్లారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక్క నర్సుమాత్రమే దిక్కయ్యింది. రోగులకు వైద్యాధికారిణి లేరని తెలపడంతో వారు ప్రైవేటు వైద్యశాలకు వెళుతున్నారు. గతంలో డాక్టర్‌ రాహుల్‌, డాక్టర్‌ వంశీ ఉన్న సమయంలో ఆరోగ్య కేంద్రానికి రోజుకు 100 నుంచి 130 ఓపీలు వచ్చేయి. అప్పట్లో రోగులతో ఆరోగ్యకేంద్రం కిటకిటలాడింది. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 30 మాత్రమే ఓపీలు వస్తున్నాయి. వైద్యాధికారిణి మీటింగ్‌లకు, సెలవు పెట్టిన సమయంలో ఆరోగ్య కేంద్రంలో నాడిపట్టే నాథుడే కరువవుతున్నారు.

గత నెల నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కరువు

గ్రామీణ ప్రాంతాలలోని రోగులకు గ్రామాలకు వెళ్లి 104 వాహనం ద్వారా వైద్యం చేస్తున్న డాక్టర్‌ గత నెల నుంచి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కరు వైంది. గతంలో నిత్యం ఒక గ్రామంలో పర్యటించేవారు. ప్రస్తుతం 104 వాహనంలో డాక్టర్‌ లేకపోవడంతో ఏఎన్‌ఎంలే దిక్కయ్యారు. దీంతో రోగులకు వైద్యం కరువైంది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రొగ్రాం మూడు రోజుల ముచ్చటగా మారిందని గ్రామీణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-06-03T01:33:40+05:30 IST