డస్ట్ టిప్పర్లు తిరగనివ్వం
ABN , First Publish Date - 2023-08-02T22:50:20+05:30 IST
వెంచర్లలో మెరక కోసం వందలాది టిప్పర్ల ద్వారా డస్ట్ తరలిస్తూ దుమ్ము దూళితో ఇళ్లు, గుంతలతో రోడ్డు పాడయ్యాయని మహిళలు రెండోరోజూ తమ నిరసన గళం విప్పారు. రోడ్డుకు అడ్డంగా చిల్లకంప, పెద్దపెద్ద బండరాళ్లు వేసి అడ్డంగా కూర్చున్నారు. ఈ సంఘటన పట్టణం సమీపంలోని శంఖవరం గ్రామంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు వాగ్వివాదం జరిగింది. ఆర్డీవో అజయ్కుమార్ హామీతో మహిళలు నిరసన విరమించారు.
రెండోరోజూ రోడ్డుకు అడ్డంగా చిల్లకంప వేసిన గ్రామస్థులు
ఎమ్మెల్యే వెంచర్కు రోజుకు వందలాది లారీల్లో మట్టి రవాణ
ప్రజలు సమస్యలు పట్టని నేతకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకని నిరసన
ఆర్డీవో సర్దిచెప్పటంతో శాంతించిన మహిళలు
కనిగిరి, ఆగస్టు 2 : వెంచర్లలో మెరక కోసం వందలాది టిప్పర్ల ద్వారా డస్ట్ తరలిస్తూ దుమ్ము దూళితో ఇళ్లు, గుంతలతో రోడ్డు పాడయ్యాయని మహిళలు రెండోరోజూ తమ నిరసన గళం విప్పారు. రోడ్డుకు అడ్డంగా చిల్లకంప, పెద్దపెద్ద బండరాళ్లు వేసి అడ్డంగా కూర్చున్నారు. ఈ సంఘటన పట్టణం సమీపంలోని శంఖవరం గ్రామంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు వాగ్వివాదం జరిగింది. ఆర్డీవో అజయ్కుమార్ హామీతో మహిళలు నిరసన విరమించారు.
టిప్పర్లకు అడ్డంగా కూర్చుని భీష్మించిన మహిళలు
రాత్రీపగలూ తేడా లేకుండా రయ్రయ్మంటూ రొద పెడుతూ టిప్పర్లు గ్రానైట్ డస్ట్ తరలిస్తున్నాయని మహిళలు పోలీసులు, కమిషనర్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలు మోడల్స్కూల్కు వెళ్లాలంటే ఆటోలు గుంతల్లోపడి ఎక్కడ పడతాయో అని భయాందోళనలు చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక వాడుక నీరు సక్రమంగా రావని, నీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకునే వారు లేరని నిలదీశారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డులో వెళ్లాలంటేనే భయంగా ఉందని వాపోయారు. ఎమ్మెల్యే వేస్తున్న వెంచర్లకు వందలాది టిప్పర్ల ద్వారా డస్ట్ తరలిస్తున్నారని తెలిపారు. దీంతో రోడ్డంతా దుమ్ము లేచి ఇళ్లలోకి వస్తుందని, అన్నం, కూరలు కూడా పాడైపోతున్నాయని కన్నీరు పెట్టుకున్నారు. డస్ట్ కారణంగా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్లు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారని, అందుకోసం రూ.2లక్షలు ఖర్చయిందని ఓ మహిళ ఏడ్చింది. రోడ్డు వేసేవరకు టిప్పర్లు తిప్పనివ్వబోమని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, అధికారులు ఆర్డీవోకు సమాచారం ఇచ్చారు.
ప్రజా సమస్యలు పట్టని ఎమ్మెల్యేకు రియల్ ఎస్టేట్ వ్యాపారమెందుకు
ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే పట్టించుకోకుండా తమ ప్రాంతంలో వెంచర్లెందుకని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వేయాలని ఇటీవల గడపగడపకూ కార్యక్రమంలో విన్నవిస్తే 6నెలల్లో రోడ్డు వేయిస్తానని నమ్మించి ఉడాయించాడని ఎద్దేవా చేశారు. పనికిరాని పథకాలకు డబ్బులు ఇచ్చేకన్నా ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకుం ప్రభుత్వ ధనం వాడాలని హితవు పలికారు. ఎమ్మెల్యే వచ్చి హామీ ఇస్తేనే నిరసన ఆపుతామని మహిళలు చెప్పారు.
ఆర్డీవో చొరవతో నిరసన విరమించిన మహిళలు
సమాచారం తెలుసుకున్న ఆర్డీవో అజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలు ఆర్డీఓ ఎదుట సమస్యల గోడు దండకం చదివారు. ఆర్డీవో మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులను, మున్సిపల్ అధికారులను, గ్రానైట్ క్వారీ యజమానులకు, టిప్పర్ లారీల యజమానులను, రెవెన్యూ అధికారులను సమావేశపరుస్తానని ప్రజలు కూడా సమావేశానికి వస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు నిరసన విరమించారు.