ఏకలవ్యలో విద్యార్థులకు అస్వస్థత
ABN , First Publish Date - 2023-03-02T23:44:18+05:30 IST
ఒకరిద్దరు కాదు ఏకంగా 24మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తాము చదువుకుంటున్న బెంచీపైనే కుప్పుకూలి వైద్యం పొందుతున్నారు. పూలచెట్ల వద్ద కొందరు, మెట్ల దగ్గర కొందరు, ఆరుబయట మరి కొందరు వాంతులు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చూసిన మిగిలిన విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన స్థానిక ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలో గురువారం ఉదయం చోటుచేసుకొంది. స్థానిక ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రభుత్వ వైద్యశాలలో పలువురికి చికిత్సలు
పరామర్శించిన ఐటీడీఏ పీవో, తహసీల్దారు, డిప్యూటీ డీఎంహెచ్వో
పెద్ద దోర్నాల, మార్చి 2 : ఒకరిద్దరు కాదు ఏకంగా 24మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తాము చదువుకుంటున్న బెంచీపైనే కుప్పుకూలి వైద్యం పొందుతున్నారు. పూలచెట్ల వద్ద కొందరు, మెట్ల దగ్గర కొందరు, ఆరుబయట మరి కొందరు వాంతులు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చూసిన మిగిలిన విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన స్థానిక ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలో గురువారం ఉదయం చోటుచేసుకొంది. స్థానిక ఏకలవ్య గురుకుల పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి భోజన వసతి పాఠశాల వద్దే ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉన్నపళంగా 22మంది విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలారు. వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు అల్పాహారం తీసుకోగా, మరికొందరు తీసుకోలేదని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రిన్సిపల్ శామ్యల్ జోబ్ ఆధ్వర్యంలో వీరిలో కొందరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పాఠశాలలోనే చికిత్సపొందుతున్నారు. విద్యార్థులు చదువుకునే తరగతి గదుల్లోనే వైద్యసిబ్బంది సెలైన్ ఎక్కిస్తున్నారు. సమాచారం తెలియడంతో తహసీల్దార్ వేణుగోపాల్ వైద్యశాలలో విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై అధికారులు ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఆహారం, నీరు, విద్యార్థుల, రక్త, మూత్ర నమూనాలు సేకరించారు. పరీక్షల అనంతరం విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురైంది తెలుస్తుందన్నారు. పాఠశాల పరిసరాలు అస్తవ్యస్తంగా ఉండడంపై తహసీల్దార్ అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపల్కు సూచించారు.
పూర్తిగా కోలుకునే వరకు వైద్య చికిత్సలు
విషయం తెలియడంతో వెంటనే సబ్కలెక్టర్ సేతుమాదవన్ వైద్యశాలకు చేరకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ ఘటనకు కారణాలు విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి, డిప్యూటి డీఎంహెచ్వో శ్రీనివాసరావులు కూడా పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.