దర్శి ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2023-01-25T23:03:52+05:30 IST
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వేణుగోపాల్కు తృటిలో ప్రమాదం తప్పింది.
గేదె బెదిరి మీదకు రావడంతో అధికారులు, జనాలూ పరుగులు
ముండ్లమూరు, జనవరి 25 : మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే వేణుగోపాల్కు తృటిలో ప్రమాదం తప్పింది. కాటూరి చంద్రమౌళి ఇంటికి వెళ్తుండగా ఇంటి యజమాని రెండు రోజుల క్రితం ఒక గేదెను కొనుగోలు చేసి ఇంటి ముందు కట్టి వేసి దోమ తెర వేశారు. అదే సమయంలో ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు వెంట నడుస్తుండగా గేదె బెదిరి ఒక్కసారిగా పలుగు తెంచుకొని జనాలను పొడిచింది. ఎమ్మెల్యే అప్రమత్తమై గేదె యజమాని చంద్రమౌళి ఇంటిలోకి పరుగెత్తారు. అనుచరులు, అధికారులదీ అదే పరిస్థితి. ఎంపీటీసీ దాసరి పెద అంజయ్యను, గేదె యజమాని కాటూరి చంద్రమౌళిని పొడవటంతో వారిద్దరికి గాయాలయ్యాయి. గేదె అంతటితో ఆగక దాదాపు 20 నిమిషాలు హల్చల్ చేసింది. వైసీపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని రక్షణగా నిలబడ్డారు.