పంట నష్టాన్ని పట్టించుకోలేదు
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:14 PM
మండలంలోని మిచౌంగ్ తుఫాన్ రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది. ఆరు గాలం కష్టపడి వేలాది రూపాయల పంటలకు పెట్టుబడి పెట్టి తీరా నోటికి కాడికి వచ్చే సరికి రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. తుఫాన్ వెళ్లి రెండు రోజులవుతున్నా మండలంలో రైతులు సాగు చేసిన పంటల్లో నీరు అలాగే ఉండి పోయింది. దీంతో పంటలు నీటిలో తేలాడుతున్నాయి.
రైతులకు కోలుకోలేని దెబ్బతీసిన మిచౌంగ్
సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు
ముండ్లమూరు, డిసెంబరు 18 : మండలంలోని మిచౌంగ్ తుఫాన్ రైతులను తీవ్ర నష్టాల పాలు చేసింది. ఆరు గాలం కష్టపడి వేలాది రూపాయల పంటలకు పెట్టుబడి పెట్టి తీరా నోటికి కాడికి వచ్చే సరికి రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. తుఫాన్ వెళ్లి రెండు రోజులవుతున్నా మండలంలో రైతులు సాగు చేసిన పంటల్లో నీరు అలాగే ఉండి పోయింది. దీంతో పంటలు నీటిలో తేలాడుతున్నాయి. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ పరిధిలో కెల్లంపల్లి, శ్రీనివాస నగర్, బస్వాపురం గ్రామాల్లో వరి, మినుము, శనగ, వైట్ బర్లి పొగాకు నీటిలోనే ఉండి పోయాయి. రైతులు చేసేదేమి లేక నిలబడిన నీటిని బయటకు వెళ్లగొట్టుకుంటున్నారు. శ్రీనివాస నగర్లో వరి దాదాపు మూడు వందల ఎకరాలకు పైగానే కోతకు వచ్చి నీటిలో తేలాడుతుంది. రైతులు పొలం వెళ్లి పంట చూసుకొని కడుపు కోతకు గురవుతున్నారు. పంట కోసం తెచ్చిన పెట్టుబడులు ఎలా తీర్చాలంటూ తలలు పట్టుకున్నారు. మండలంలో ప్రధానంగా రెడ్డినగర్, పసుపుగల్లు, నాయుడుపాలెం, తమ్మలూరు, వేములబండ, చింతలపూడి, పూరిమెట్ల, మారెళ్ల, తూర్పుకంభంపాడు, సుంకరవారిపాలెం, శంకరాపురం గ్రామాల్లో రైతులు సాగు చేసిన మిర్చి, మొక్క జొన్న, పొగాకు పూర్తిగా నేల మట్టమయ్యాయి. మిర్చి పంట ఐతే ముమ్మరంగా కా పు, పూత, పిందె మీద ఉంది. మిరప చెట్లు పూర్తిగా గాలికి పక్కకు ఒరిగి పో యాయి. కోయడానికి వచ్చిన పండు మిర్చి చెట్టునే కుళ్లింది. దీంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. మిర్చి పొలాల్లో ఇంకా నీరు ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని వేములబండలో కంది పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సాయం కోసం ఎదురు చూపులు
పంటలు నష్ట పోయి 11 రోజులు రోజులు దాటినా కూడా ఇంత వరకు వ్యవసాయ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ పొలాలను సందర్శించి ఏఏ పంటలు ఎంత మేరకు నష్ట పోయాయో అంచనా వేయలేదు. దీంతో రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం నష్ట పోయిన పంటల కైనా సాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని ఎదురు చూస్తున్న పరిస్థితి రైతుల్లో ఏర్పడింది. ప్రభుత్వం ఇంత వరకు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయమని చెప్పిన దాఖలాలు లేవు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు ఆశలు ఆవిరి అయ్యాయి. పుట్టిన కాడి కల్లా అప్పులు తీసుకు వచ్చి పంటలు సాగు చేస్తే తుఫాన్ దాటికి పంటలు తీ వ్రంగా దెబ్బతిని రైతులు నష్టాల బాట పట్టారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం స మీక్షలు నిర్వహించి బాధితులను ఆదుకుంటామని చెప్పిన మాటలు నీట మూటలయ్యాయి. ఒక వైపు సాయం కొద్దోగొప్పో వస్తుంది. కొంత మేరైనా ఇబ్బందులు లేకుండా అనుకున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.
15 ఎకరాల్లో శనగ నీటిపాలు
ఈ ఏడాది 15 ఎకరాల మాగాణి భూమిలో సాగర్ జలాలు రాక పోవడం వల్ల మెట్ట పైరు అయిన వనగ పైరు వేశాను. ప్రస్తుతం శనగ పైరు ఆశాజనకంగా ఉన్న దశలో తుఫాన్తో నష్టం వాటిల్లింది. శనగ పైర్లు చెరువులను తలపించింది. పూర్తిగా నష్టానికి గురయ్యాను. కనీసం పెట్టుబడి కూడా రాదు. అప్పులు తీర్చే దారి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
- నిడమానూరి వెంకటేశ్వర్లు, రైతు, కెల్లంపల్లి
ఉరకేసిన మిరప
మా గ్రామంలో రెండు ఎకరాల మిర్చి తోటను సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష చొప్పున రెండు లక్షలు పెట్బుబడి పెట్టాను. తోట ఆశాజనకంగా ఉంది. ఎంతోకొంత వస్తుందని ఆశ పడ్డాను. తుఫాన్ రెండు ఎకరాల మిర్చి ఉరక వేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
- తూము రాఘవరెడ్డి, రైతు, రెడ్డినగర్