భారీ వర్షంతో తడిచిన మిరప కల్లాలు

ABN , First Publish Date - 2023-03-26T01:16:53+05:30 IST

కంభం, అర్థవీడు మండలాల్లో శనివారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి హఠాత్తుగా పెనుగాలులతో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షంతో తడిచిన మిరప కల్లాలు

కంభం, మార్చి 25 : కంభం, అర్థవీడు మండలాల్లో శనివారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి హఠాత్తుగా పెనుగాలులతో భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిచి పోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంభం మండలంలో కందులాపురం, కంభం, ఔరంగబాద్‌, నడింపల్లి, జంగంగుంట్ల, ఎల్‌.కోట, లింగోజీపల్లి, అర్థవీడు మండలంలో కాకర్ల, నాగులవరం, తదితర గ్రామాలలో వర్షం ప్రభావం చూపింది. ఆయా గ్రామాల్లో రైతులు రంగనాయకులు, రంగసాయి, పాండురంగయ్య, చిన్నకోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, పోలురాజు, మునుస్వామిల పొలాల్లో ఆరబెట్టిన మిర్చి తడిచింది. ఈదురు గాలులకు, వర్షానికి భయపడిన రైతులు ఎక్కడ పిడుగులు పడతాయోనని ఇళ్లకు పరుగులు తీశారు. వర్షం తగ్గిన తరువాత కల్లాల్లోకి వెళ్లిన రైతులకు మిర్చిపై కప్పిన ప్లాస్టిక్‌ పట్టలు లేకపోవడంతో రైతులకు కన్నీరే మిగిలింది. ఎన్నో కష్టనష్టాలు ఓర్చి చేతికి వచ్చిన మిర్చ పంట తడిచి బూజుపడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రగొండపాలెంలో అకాల వర్షం

ఎర్రగొండపాలెం : మండలంలో శనివారం సాయంత్రం 4 గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో 20 నిముషాలు పాటు వర్షం కురిసింది. దీంతో వీదుల్లో రోడ్లపై నీరు ప్రవహించింది. ఎర్రగొండపాలెం పట్టణం చుట్టూ గ్రామాల్లో ఈ వర్షం కురిసింది.

Updated Date - 2023-03-26T01:16:53+05:30 IST