పొగాకు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ABN , First Publish Date - 2023-03-29T00:08:51+05:30 IST
: పొగాకు మార్కెట్ ధరలు ప్రస్తుతం రైతులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తు న్నాయి. జిల్లాలో మొదటి విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై ఇంచుమించు నెలరోజులు కావస్తోంది.
పొదిలి రూరల్, మార్చి 28 : పొగాకు మార్కెట్ ధరలు ప్రస్తుతం రైతులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తు న్నాయి. జిల్లాలో మొదటి విడత పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై ఇంచుమించు నెలరోజులు కావస్తోంది. అయితే తొలిరోజు కిలో రూ.200ల మార్కెట్ ధర ఉండగా, ఇప్పటికీ నిలకడగా అదే ధర కొనసాగుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ప్రారంభమైన అన్ని కేంద్రాలలో గరిష్ఠ ధర కిలో రూ.200లు పలుకగా మంగళవారం పొదిలి వేలం కేంద్రంలో లోగ్రేడ్ రూ.175 పలకడం విశేషం. ఎప్పుడు లేనివిధంగా ఆశించిన ధరలకంటే ఎక్కువ పలకడంతో పొగాకు రైతుల్లో మళ్లీ పొగాకు సాగు చేయాలనే ఆశలు రెట్టింపు అవుతోందని గోవింద్, కొండలు, కోటేశ్వరరావులు పేర్కొంటున్నారు. పొదిలిలో రోజుకు సరాసరి 500ల బేళ్లు అమ్మకానికి పెడుతున్నామని అందులో సీఆర్ (తిరస్కరణ)లు 20 బేళ్లు మాత్రమే ఉంటున్నాయన్నారు. నాణ్యమైన పొగాకు బేళ్లు అమ్మకానికి రావడం లోగ్రేడ్ తగ్గడంతో వ్యాపారులు కొనుగోలుకు పోటీపడుతున్నారు. అంతేకాకుండా బోర్డు అధికారులు నాణ్యతపై, మందుగానే మండెల ఏర్పాటు పై అవగాహన కల్పించడం, దానికితోడు వాతావరణం చల్లబడడంతో రైతులకు అనుకూలంగా మండెలు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కలిగింది. దీంతో ప్రస్తుతం నాణ్యత ఉన్న పొగాకు వేలానికి రావడంతో ఆశించిన ధర పలుకుతోందని, వేలం నిర్వాహణాధికారి గిరిరాజకుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది పెరిగిన కూలీ ధరలను దృష్టిలో ఉంచుకొని ధరలు రూ. 200లకు పైగా ఉంటేనే రైతులకు గిట్టుబాటు ఉంటుందని రైతు సంఘాలు కోరాయి. ఈ ఏడాది హైగ్రేడ్తో సమానంగా లోగ్రేడ్ ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రైట్ రకానికి డిమాండ్ పెరిగితే ఇంకా ధర పెరగవచ్చని రైతులు ఆశపడుతు న్నారు. కర్ణాటకలో వేలం ముగియడంతో వ్యాపారులు మన రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేయడంతో మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉందని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 11295 బేళ్లు అమ్మకానికి రాగా 9610 బేళ్లు వివిధ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఏదిఏమైనా చాలా రోజుల తరు వాత ఆశించిన ధర పలకడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరిసింది.
నాణ్యమైన పొగాకుబేళ్లు రావడంతో
ధరలు అనుకూలం - ఏఎస్ గిరిరాజకుమార్
నాణ్యమైన పొగాకు బేళ్లు అమ్మకానికి రావడంతో ఈ ఏడాది అనుకూలమైన ధరలు పలుకుతున్నాయి. వాతావరణం అనుకూలించడం, రైతులు మండెలు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవడంతో పొగాకు నాణ్యత పెరిగింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ముక్క, బిట్స్ ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి వేలం కేంద్రంలోనే కొనుగోలు చేసే అవకాశం కల్పించాం. బేల్ పట్టలతో చెక్కుకట్టాలి, తూకం 150 కిలోలు మించ కుండా బేలు ఏర్పాటు చేయాలి. రోజువారి అమ్మకం కోటాలో కలవదు. ఉన్న పొగాకు ముక్కను పూర్తిగా అమ్ముకోవచ్చు. గ్రేడింగ్ విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్కు మీ వద్ద ఉన్న ముక్క వివరాలు నమోదు చేయించుకోవాలి.