ప్రజావ్యతిరేక పాలనను తిప్పికొట్టాలి
ABN , First Publish Date - 2023-09-04T22:43:43+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలు తిప్పికొట్టాలని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం శ్రేణులతో కలసి కనిగిరిలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జీవీ కొండారెడ్డి
కనిగిరి, సెప్టెంబరు 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలు తిప్పికొట్టాలని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం శ్రేణులతో కలసి కనిగిరిలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరకుల ధరలను ప్రభుత్వాలు నియంత్రించకుండా ప్రజలకు నానా కష్టాలు కల్గిస్తున్నాయన్నారు. ప్రజల కష్టార్జితాన్ని అన్ని రకాల వస్తువులతోపాటు ఆయిల్, రవాణా, గ్యాస్, విద్యుత్ చార్జీలు పెంచి దండుకుంటున్నాయని విమర్శించారు. కనిగిరి డివిజన్గా మారినా ఏమాత్రం అభివృద్ధి లేదన్నారు. కనీసం ట్రిపుల్ ఐటీ కళాశాలకు శంకుస్థాపన చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. ్లజగనన్న కాలనీలో ఒక్కో ఇంటికి రూ.10లక్షలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ గత ఏడాది ఇంటింటికీ కుళాయి వేయించి మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటింటికీ డ్రమ్ముల పాలన తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ మాలకొండయ్య, ఎస్కే ఖాదర్వలి, సీహెచ్ ప్రసాద్, పీ నరేంద్ర, ఏడుకొండలు, ఎస్కే బషీరా, ప్రసన్న, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు ఇంటి స్థలాలు కేటయించాలని కోరుతూ ఆర్డీవో టీ అజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.
కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలి
దర్శి, సెప్టెంబరు 4 : పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాల వలన నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. సామాన్య ప్రజలు పెరిగిన ధరలను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, నాగేశ్వరరావు, ఆదినారాయణ అంజిబాబు పాల్గొన్నారు.