పదో తరగతి సైన్స్ పరీక్ష జరభద్రం
ABN , First Publish Date - 2023-04-13T01:03:59+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఈనెల 13న జరిగే సైన్స్ సబ్జెక్టు అసలైన పరీక్షగా నిలువనుంది.
రెండు సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం
జవాబు రాసేందుకు వేర్వేరు బుక్లెట్లు
విద్యార్థులు అప్రమత్తంగా లేకపోతే తీవ్రనష్టం
ఒంగోలు (విద్య), ఏప్రిల్ 12 : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఈనెల 13న జరిగే సైన్స్ సబ్జెక్టు అసలైన పరీక్షగా నిలువనుంది. విద్యార్థులు అప్రమత్తంగా లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ప్రశ్నలను ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. మూల్యాంకనం చేసేందుకు ఏ సబ్జెక్టుకు ఆ జవాబుపత్రాలను వేర్వేరుగా ఇస్తారు. అంటే ఒక్క ప్రశ్నపత్రం, రెండు జవాబు పత్రాలు. ఈ విధానాన్ని కొత్తగా ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చారు. గతంలో పది పరీక్షల్లో ఒక్క హిందీ మినహా అన్ని సబ్జెక్టులకు రెండేసి చొప్పున 11 పరీక్షలు విద్యార్థులు రాయాల్సి వచ్చేది. అయితే గతేడాది నుంచి పరీక్షల సంఖ్యను కుదించారు. అన్ని సబ్జెక్టులకు 100 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఇవ్వగా జనరల్ సైన్స్లో మాత్రం ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరుగా 50 మార్కుల చొప్పున నిర్వహించారు. ఈ ఏడాది ఆ విధానాన్ని మార్చి ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండింటినీ ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో వంద మార్కులకు 33 ప్రశ్నలు ఇస్తుండగా సైన్స్లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జనరల్ సైన్స్లో మొత్తం 16 ప్రశ్నలు, పీఎస్ నుంచి మిగిలిన 17 ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ రెండు సబ్జెక్టుల జవాబులను వేర్వేరుగా రాసేందుకు ఒక్కొక్కరికి రెండేసి 12 పేజీల జవాబుపత్రాల బుక్లెట్ను ఇవ్వనున్నారు.