సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన

ABN , First Publish Date - 2023-06-07T23:48:01+05:30 IST

గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ప్రజల వద్దకు పరిపాలన తెచ్చి, ప్రజావసరాలు తీరుస్తున్నామని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు.

సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన
పిడూరులో ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

మనుబోలు, జూన్‌ 7: గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ప్రజల వద్దకు పరిపాలన తెచ్చి, ప్రజావసరాలు తీరుస్తున్నామని కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. మండలంలోని పిడూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన సేవా వినతుల శిబిరానికి బుధవారం హాజరయ్యారు. గ్రామంలో ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయాల ద్వారా అందించే సర్వీసులపై ప్రయోగాత్మకంగా ప్రజలకు సత్వరమే అందించే ఒక ప్రాజెక్టును నిర్వహించామన్నారు. ఇందుకోసం రాష్ట్రానికే పిడూరు సచివాలయాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. మూడురోజులుగా పలువురు అధికారులు సర్వేలు చేసి, ప్రజల వద్దకు వెళ్లి, వారి అవసరాల మేరకు ఎలాంటి సర్వీసులు కావాలో గుర్తించి నమోదు చేశారన్నారు. పిడూరు సచివాలయంలో 700కుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. దీనిద్వారా ప్రజల నుంచి వచ్చే స్పందనపై నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.

మండలంలో సుడిగాలి పర్యటన

పిడూరు సచివాలయంకు వచ్చిన కలెక్టర్‌ పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. అక్కడ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచించారు. అలాగే వెంకన్నపాళెం రైతుభరోసా కేంద్రం, సచివాలయాలను సందర్శించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. బద్దెవోలులో విలేజ్‌క్లినిక్‌, వెల్‌నెస్‌ సెంటర్లను తనిఖీ చేశారు. తర్వాత మనుబోలు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జేవీవీ కిట్ల స్టాక్‌ పాయింట్‌ను తనిఖీ చేశారు. అనంతరం మడమనూరు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఇటీవల పది పలితాల్లో మండల టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థినులను అబినందించారు. ఉద్యోగులు ప్రతి పనిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్‌ల్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సంజనా సింహా, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, డీపీవో సుస్మితారెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌, డీఈవో గంగాభవాని, డీఎల్‌డీవో వసుమతి, తహసీల్దారు లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈవో శేషాద్రివాసు, కార్యదర్శి కృష్ణవేణి, వీఆర్వో శీనమ్మ, మండల ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకట రమణారెడ్డి, సర్పంచు చెంచు మునెయ్య, వైసీపీ నాయకులు మన్నెమాల సాయిమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

=============

Updated Date - 2023-06-07T23:48:01+05:30 IST