ఇది పాఠశాల ప్రాంగణమే..!
ABN , First Publish Date - 2023-01-20T22:33:00+05:30 IST
రుద్రకోట పాఠశాల ప్రాంగణంలో మట్టి దిబ్బలు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది అక్షరాలా పాఠశాల ప్రాంగణమే. అదనపు గదుల నిర్మాణానికి తవ్విన గుంతల్లోని మట్టిని ప్రాంగణంలో పోయడంతో అది మైదానప్రాంతగా మారింది. దీంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. ఇది కావలి మండలం రుద్రకోట హైస్కూల్లో దుస్థితి. రుద్రకోట జడ్పీ హైస్కూల్లో సుమారు 12 తరగతి గదులు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రాంగణంలో అధిక సంఖ్యలో మెక్కలు నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇంకా అదనపు గదులు అవసరమైతే ప్రస్తుతం ఉన్న భవనాలపై నిర్మాణాలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఖర్చు తగ్గడంతో పాటు పాఠశాల ప్రాంగణంలో విద్యార్ధులకు ఆట స్థలం తగినంతగా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రభుత్వంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గుంతలు తీసి ఆ మట్టిని ప్రాంగణంలోనే పోసి చదును చెయ్యకుండా వదిలేశారు. దీంతో గతంలో ఖోఖో, కబడ్డీ, 100, 200 మీటర్ల పరుగు పందెంలో జోన్ల్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచే ఇక్కడి విద్యార్ధులు మూడేళ్లుగా ఆటలకు దూరం అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- కావలిరూరల్