రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2023-02-06T21:18:08+05:30 IST
మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీ
వరికుంటపాడు, ఫిబ్రవరి 6: మండలంలోని వరికుంటపాడు, తూర్పుబోయమడగల, జడదేవి రేషన్ దుకాణాలపై సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి విష్ణురావు ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం అందుకున్న అధికారులు తెల్లవారు జామునుంచే ప్రత్యేక నిఘాతో దాడులు చేపట్టి అవినీతి డీలర్ల గుట్టును రట్టు చేశారు. వరికుంటపాడులోని 22వ నెంబరు దుకాణంలో 22 బస్తాలకుపైగా బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తూర్పుబోయమడగలలోని 18వ నెంబరు దుకాణంలో సైతం సుమారు 5వేల కిలోల వరకు బియ్యం మాయమవడంతోపాటు కేవలం 1 బస్తా మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కువ మోతాదులో తేడాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆయా దుకాణాలను సీజ్ చేశారు. ఇరువురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. అంతేకాక నిల్వ ఉన్న బియ్యాన్ని కందుకూరు సివిల్ సప్లయ్ డీటీకి స్వాధీనం చేశారు. ఈ దాడుల్లో సీఐలు మాణిక్యాలరావు, సుధాకర్రెడ్డి, ఏఈ వెంకటరెడ్డి, ఎఫ్ఆర్వో గోపాలకృష్ణ, సివిల్ సప్లయ్ డీటీ జనార్దన్, ఏవో సంగమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీ
ఉదయగిరి రూరల్, ఫిబ్రవరి 6: పట్టణంలోని పౌరసరఫరా గోదాములను, రెండు చౌక దుకాణాలను సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ సుధాకర్రెడ్డి, ఏఈ వెంకటరెడ్డి గోదాము, రేషన్ దుకాణాల్లో రికార్డులు పరిశీలించి నిల్వలను సరి చూశారు. కాగా అధికారుల రాకను ముందే గుర్తించిన పలువురు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.