పటిష్టంగా సబ్స్టేషన్ల నిర్వహణ
ABN , First Publish Date - 2023-06-03T00:05:29+05:30 IST
జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు సబ్స్టేషన్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలని విద్యుత్శాఖ ఎస్ఈ వెంకటసుబ్బయ్య చెప్పారు.
నెల్లూరు(జడ్పీ): జూన్ 2: జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు సబ్స్టేషన్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలని విద్యుత్శాఖ ఎస్ఈ వెంకటసుబ్బయ్య చెప్పారు. జిల్లాలోని ఈఈలు, డీఈలు, ఏఈలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎండలు అధికంగా ఉండడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, రోజువారీ వినియోగం 21 మిలియన్ యూనిట్లకు పెరిగినా అందుకు అనుగుణంగా సరఫరా ఉందన్నారు. లైన్లలో అక్కడక్కడా అంతరాయాలు ఏర్పడుతున్నందున సబ్స్టేషన్ల నిర్వహణను పటిష్టంగా చేయాలన్నారు. అలాగే మీటర్ రీడింగ్ ఐఆర్డీఏ ద్వారానే జరగాలన్నారు. డివిజన్ల పరిధిలో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించేందుకు అధికారులంతా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. లైన్ల మరమ్మతుల సమయంలో సిబ్బంది భద్రతా కిట్లను ధరించాలని సూచించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల నిర్మాణాలు పూర్తయితే వెంటనే విద్యుత్ కనెక్షన్లను ఇవ్వాలని ఎస్ఈ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎనర్జీ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
-----------