మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2023-07-21T01:17:52+05:30 IST

మండలంలోని పెనుబల్లికి చెందిన మతిస్థిమితంలేని మహిళ ప్రతిమ హత్య కేసులో నిందితుడు మైపాటి పెంచలయ్యను గురువారం సీఐ జీ.రామారావు చాకచక్యంగా అరెస్టు చేశారు.

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
4బీఆర్‌పీ20, ప్రతిమ హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ, పక్కన ఎస్‌ఐ

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 20: మండలంలోని పెనుబల్లికి చెందిన మతిస్థిమితంలేని మహిళ ప్రతిమ హత్య కేసులో నిందితుడు మైపాటి పెంచలయ్యను గురువారం సీఐ జీ.రామారావు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం బుచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కే.వీరప్రతాప్‌, సిబ్బందితో కలసి ఆయన విలేకరులకు హత్య కేసు వివరాలు వెల్లడించారు. దాసరి ప్రత్యూష అక్క ప్రతిమ మానసిక వికలాంగురాలు, ఆమె గత నెల 26న రాత్రి 10గంటల తర్వాత నుంచి ఇంట్లో కనిపించకపోవడంతో పలుచోట్ల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లేదు. దీంతో ఈనెల 11న ప్రత్యూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో 13వ తేదీ ఉదయం ఇంటి పరిసరాలలో అక్క కోసం వెతుకుతున్న చెల్లెలకు దారిలో పలుచోట్ల ప్రతిమకు చెందిన చేతి గాజు ముక్కలు, చెప్పులు పడి ఉండడంతో అదే మార్గంలో కొంతదూరం వెతుకుతూ వెళ్లింది. జొన్నవాడ పీహెచ్‌సీ ఎదురుగా జొన్నవాడ ఆలయ భూమిలో ఓ గుంత, దానిపై పరుపు ఉండడాన్ని గమనించి అక్కడికి వెఎళ్లి ఆ పరుపును తొలగించి చూడగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన అక్క వేసుకుని ఉన్న డ్రెస్‌ కనిపించింది. కాగా గుంత నుంచి దుర్వాసన వస్తుండడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో సీఐ జీ.రామారావు, ఎస్‌ఐ కే.వీరప్రతాప్‌ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం శవపరీక్ష అనంతరం విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో మృతురాలి తల్లికి ఇంటికి వచ్చి ఇంజక్షన్‌ వేసి వెళుతున్న పెనుబల్లిలో తిప్పపైన నివాసం ఉంటున్న మైపాటి పెంచలయ్యపై అనుమానంతో అతనిని గురువారం పెనుబల్లి, జొన్నవాడ రోడ్డులో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. తల్లికి ఇంజక్షన్‌ వేసేందుకు వెళుతున్న పెంచలయ్య కన్ను ఆమె మతిస్థితిమితం లేని, భర్తను వదిలేసి ఒంటరిగా ఉన్న కుమార్తె ప్రతిమపై కన్ను పడింది. గత నెల 26వ తేదీ రాత్రి 11గంటల సమయంలో ఇంటి బయట ఉన్న ప్రతిమకు మాయమాటలు చెప్పి ఇంటి పక్కనే ఉన్న గుంతలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం హత్యచేసి మృతదేహాన్ని జొన్నవాడ పీహెచ్‌సీ ఎదురుగా ఉన్న ఆలయ భూమిలో పాతిపెట్డాడు. అతని నుంచి మృతురాకి చెందిన బంగారు, వెండి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. రూరల్‌ డీఎస్పీ పి. వీరాంజనేయరెడ్డి సూచనల మేరకు బుచ్చి సీఐ జి.రామారావు, ఎస్‌ఐ. కే. వీరప్రతాప్‌ సిబ్బంది నిందితుడ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.

Updated Date - 2023-07-21T01:17:52+05:30 IST