వరదనష్టం లేకపోతే సీఎం ఎందుకొచ్చారు..?

ABN , First Publish Date - 2023-01-20T22:47:53+05:30 IST

గతేడాది వరదలకు ఇసుక మాఫియా కారణంగా పెన్నా పొర్లుకట్టలు తెగి పెనుబల్లి గ్రామం జలమయమై తీవ్ర నష్టం జరగకపోతే పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ప్రశ్నించారు.

వరదనష్టం లేకపోతే సీఎం ఎందుకొచ్చారు..?
పెనుబల్లి గ్రామంలో పర్యటిస్తున్న పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, టీడీపీ నాయకులు

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి20: గతేడాది వరదలకు ఇసుక మాఫియా కారణంగా పెన్నా పొర్లుకట్టలు తెగి పెనుబల్లి గ్రామం జలమయమై తీవ్ర నష్టం జరగకపోతే పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని పెనుబల్లి గ్రామంలో శుక్రవారం స్థానిక నాయకులు గోపాల్‌, భాస్కర్‌ గోపి, సురేంద్ర, దళిత నాయకుల ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నష్టం జరగలేదని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీఎంకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జొన్నవాడలో చారిత్రక తిప్పలో కోట్లలో గ్రావెల్‌, ఇసుక తరలిస్తున్నా అధికారులు మౌనంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చంద్రబాబును విమర్శించే ముందు మీ స్థాయిని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. నేటికీ నష్టపోయిన కుటుంబాలను ఆదుకున్న వారే లేరని స్థానికులు దినేష్‌రెడ్డి ముందు వాపోయారు. గిరిజనకాలనీకి చెందిన ఓ మహిళ వరదలకు ఇళ్లు కూలిపోతే పట్టించుకోకపోగా స్థానిక అధికారపార్టీ నాయకులు ఎండొస్తే ఆరబెట్టుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పర్యటన సందర్భంగా దినేష్‌రెడ్డిపై అభిమానంతో స్థానికులు అడుగడుగునా పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా దళితవాడలో సుమారు ఏడు కుటుంబాల నుంచి 30మందికిపైగా మహిళలతో టీడీపీలో చేరారు. దినేష్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య, నాయకులు హరికృష్ణ, కృష్ణచైతన్య, రామానాయుడు, కొండయ్య, వి.ప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, జొన్నవాడ సర్పంచు పెంచలయ్య, రత్నం, శంకర్‌, హరీష్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T22:47:55+05:30 IST