అరకొర సిబ్బందితో భూముల రీసర్వే
ABN , First Publish Date - 2023-09-21T21:47:03+05:30 IST
నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం
అసెంబ్లీలో మహీధర్రెడ్డి ఆందోళన
కందుకూరు, సెప్టెంబరు 21: నిర్ధిష్టమైన మార్గదర్శకాలు లేకుండా భూముల రీసర్వే కొనసాగిస్తుండటం సరికాదని, ఇలాగే రీసర్వే జరిగితే రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులలో గర్భకండ్రికలుగా నమోదై ఉన్న భూముల విషయంలో ఎలా వ్యవహరించాలో రీసర్వే సిబ్బందికి తగిన నిర్దేశం లేదన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా సబ్ డివిజన్చేసి అక్రమపద్ధతిలో రికార్డుల్లో రైతులపేర్లు నమోదుచేసి ఉన్నారని పేర్కొన్నారు. అనేకప్రాంతాలలో ఎస్సీ, ఎస్టీలకు పట్టాలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీచేయకుండా రీసర్వే చేశామనిపించుకోవాలన్న ఆలోచనతో హడావిడిగా నిర్వహిస్తే భవిష్యత్తులో తీవ్రమైన భూవివాదాలకు ఆస్కారం కల్పించిన వారమవుతామని ఆయన హెచ్చరించారు. కందుకూరు నియోజకవర్గంలోని సర్వే నెంబరు 116లో 999 ఎకరాల భూమిని ఆ గ్రామరైతులు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారని, నేటికీ భూమిపై వారికి హక్కులు కల్పించలేదని పేర్కొన్నారు. మంత్రి మార్గదర్శకాలు ఇచ్చేలా చూడాలని కోరారు.
----------