29 నుంచి రొట్టెల పండుగ
ABN , First Publish Date - 2023-07-15T00:11:27+05:30 IST
మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో ఈ నెల 29న ప్రారంభం కానున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి అధికారులకు సూచించారు.
నెల్లూరు (సాంస్కృతికం), జూలై 14 : మతసామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో ఈ నెల 29న ప్రారంభం కానున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు భారీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం బారాషహీద్ దర్గాను సందర్శించిన ఆయన రెవెన్యూ, నగర పాలక సంస్థ, పోలీసు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందస్తు మౌలిక సదుపాయాల కోసం నగర పాలక సంస్థ ద్వారా రూ.2.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, బారీకేడ్లు, మంచినీరు, వైద్యసదుపాయం, పారిశుధ్యం మెరుగు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. చెరువులో నీరు సమృద్ధిగా ఉండేలా చూడటంతోపాటు గజ ఈతగాళ్లు, సేఫ్టీ బోట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, డీఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆర్డీవో మాలోలా, ఆర్అండ్బీ, కార్పొరేషన్ ఎస్ఈలు గంగాధర్, సంపత్కుమార్, మత్స్య శాఖ జేడీ నాగేశ్వరరావు, పర్యాటక అధికారి సాయికృష్ణ, విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
==========