AP News: విజయవాడలో జర్నలిస్టులకు మెడికల్ క్యాంప్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-05-13T10:34:28+05:30 IST

నగరంలో జర్నలిస్టులకు మెడికల్ క్యాంపును మంత్రులు విడుదల రజని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు.

AP News: విజయవాడలో జర్నలిస్టులకు మెడికల్ క్యాంప్ ప్రారంభం

విజయవాడ: నగరంలో జర్నలిస్టులకు మెడికల్ క్యాంపును మంత్రులు విడుదల రజని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ క్యాంపులో అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు పూర్తి స్ధాయి వైద్య పరీక్షలు చేయనున్నారు. రెండు రోజులపాటు హెల్త్ క్యాంప్ జరుగనుంది. 11 ఆసుపత్రుల నుంచి 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములాంటిది: రజని

మహిళా దినోత్సవం రోజు చాలా మంది జర్నలిస్టులు హెల్త్ క్యాంపు పెట్టాలని కోరారని మంత్రి విడదల రజని తెలిపారు. హెల్త్ క్యాంపులో ఒకొక్కరికీ పదివేల రూపాయల ఖర్చుతో మొత్తం టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు ఏ వైద్య సహాయం అవసరమైనా తమ కార్యాలయానికి సంప్రదించవచ్చన్నారు. జర్నలిస్టు వృత్తి కత్తిమీద సాములాంటిదని.. ఎన్ని కష్టాలు ఉన్నా జర్నలిస్టులు విలువల కోసం పని చేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులు నిజాన్ని, మంచిని చూపిస్తారని నమ్ముతున్నానన్నారు. గ్రామస్ధాయిలోనే వారి ముంగిటిలోనే వైద్యం అందేలా ఫ్యామిలీ డాక్టర్ స్కీం తీసుకొచ్చామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

ఆరోగ్య శ్రీ లక్ష్యం అదే..: వేణుగోపాలకృష్ణ

సమాజ చైతన్యం కోసం నిత్యం పని చేస్తూ జర్నలిస్టులు అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారన్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అందరికీ వైద్యం అందించాలన్నది ఆరోగ్యశ్రీ లక్ష్యమని స్పష్టం చేశారు. సమస్యల వలయంలో చిక్కుకున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌లు, నాలుగు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతిలలో ఈ హెల్త్ క్యాంపులు ఉంటాయన్నారు. ఈ హెల్త్ క్యాంపును జర్నలిస్టులు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు.

ఐ&పీఆర్ కమీషనర్ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు అనేక ఒత్తిడుల మధ్య పని చేస్తారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టు హెల్త్ స్కీంలో రూ.1250 లతో హెల్త్ కార్డు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. జర్నలిస్టులు అందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .

వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవాలంటే ఇన్స్యూరెన్స్ తప్పనిసరి అని అన్నారు. ఆరోగ్య శ్రీ మీద 3300 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈహెచ్‌ఎస్‌కు సమానంగా జర్నలిస్టు హెల్త్ స్కీం ఉంటుందన్నారు. కుటుంబం మొత్తం కవర్ అయ్యేలా జర్నలిస్టు హెల్త్ స్కీం ఇచ్చామన్నారు. 5.3కోట్ల ఆంధ్రుల హెల్త్ రికార్డు ఫ్యామిలీ డాక్టర్ స్కీంలో పెట్టామని తెలిపారు.

Updated Date - 2023-05-13T10:48:51+05:30 IST