అంగన్వాడీల రాస్తారోకో
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:57 PM
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉధృతంగా సాగుతోంది.
శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో స్తంభించిన ట్రాఫిక్
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 22: సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉధృతంగా సాగుతోంది. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె 11వ రోజుకు చేరింది. శుక్రవారం కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు రాస్తారోకో చేపట్టారు. అరగంట సేపు ఇటు రాజ్విహార్ నుంచి సీ క్యాంపు వరకు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లోనే అంగన్వాడీ ఉద్యోగులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల రాస్తారోకో ఉద్రిక్తతంగా మారింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో కొందరు అధికారుల వాహనాలు, పోలీసుల వాహనాలు కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపైనే బైఠాయించిన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, సీఐటీయూ నాయకులు సుధాకరప్ప పోలీసులతో వాగ్వాదం చేశారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి రాస్తారోకోను భగ్నం చేశారు. అంగన్వాడీలు రాస్తారోకో చేస్తుండగా ట్రాఫిక్లో ఉన్న 108 అంబులెన్స్లు వెళ్లేందుకు అంగన్వాడీలు దారి కల్పించారు.