కేసీ కెనాల్‌లో పడి ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2023-08-23T23:32:44+05:30 IST

పొలంలో వరి కట్టలు వేసేందుకు వెళ్ళి ఇద్దరు కేసీ కెనాల్‌లో పడి మృతి చెందిన సంఘటన బండిఆత్మకూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

   కేసీ కెనాల్‌లో పడి ఇద్దరి మృతి

పాఠశాల యాజమాన్యంపై భగ్గుమన్న బంధువులు

రెండుగంటలుగా నిలచిపోయిన మృతదేహాల తరలింపు

బండిఆత్మకూరు, ఆగస్టు 23: పొలంలో వరి కట్టలు వేసేందుకు వెళ్ళి ఇద్దరు కేసీ కెనాల్‌లో పడి మృతి చెందిన సంఘటన బండిఆత్మకూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. బండిఆత్మకూరు మండలంలోని మద్దిలేరు వాగు గేట్ల వద్ద పార్నపల్లె గ్రామానికి చెందిన గోపీనాథ్‌రెడ్డి(39), గడివేముల మండలం కరిమద్దెలకు చెందిన సతీష్‌(16) ఇద్దరు కేసీ కెనాల్‌లో పడి మృతిచెందారు. గోపీనాథ్‌ రెడ్డి స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వరినారు కట్టలు వేసే పని ఉండటంతో గోపీనాథ్‌ రెడ్డి.. సతీష్‌ను వెంట తీసుకెళ్లాడు. అక్కడ కట్టలు వేసిన అనంతరం నీరు తాగేందుకు సతీష్‌ కెనాల్‌లో దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయాడు. సతీష్‌ను కాపాడేందుకు గోపినాథ్‌రెడ్డి కెనాల్‌లో దూకాడు. నీటి ప్రవాహ ఉధృతిలో ఇద్దరూ గల్లంతయ్యారు. వారి వెంట వెళ్ళిన మరో ఇద్దరు జరిగిన సంఘటనను గ్రామస్థులకు తెలియజేశారు. ఎస్‌ఐ మల్లికార్జున, బండిఆత్మకూరు, పార్నపల్లె గ్రామస్థులు కేసీ కెనాల్‌లో గాలించారు. దాదాపు గంట తర్వాత గోపీనాథ్‌రెడ్డి, సతీష్‌ల మృతదేహాలను గుర్తించారు. పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడిని పొలం పనుల కోసం ఎలా పంపిస్తారంటూ సతీష్‌ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో గొడవపడ్డారు. బాలుడి మృతదేహంతో పాఠశాల ఎదుట రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర అక్కడికి చేరుకుని నచ్చచెప్పి వారిని పంపించివేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంపై సతీష్‌ తల్లిదండ్రుల రోదన పలువురిని కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-23T23:32:44+05:30 IST