Share News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-10-30T23:33:45+05:30 IST

‘స్పందన’ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంపైనే దృష్టి సారించాలని జిల్లా ఉన్నతాధి కారులకు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

నంద్యాల టౌన్‌, అక్టోబరు 30: ‘స్పందన’ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంపైనే దృష్టి సారించాలని జిల్లా ఉన్నతాధి కారులకు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 195 ఫిర్యాదులను స్వీకరించి సమస్యల పరిష్కారంపై బాధితులతో, సంబంధిత అధికారులతో మాట్లాడారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమం అనంతరం జేసీ టి.రాహుల్‌ కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ పుల్లయ్యతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత వారం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అన్నిరంగాలలో అభివృద్ధి సాధిస్తుందని అభినందనలు రావడంతో జిల్లా అధికారులను కలెక్టర్‌ అభినందించారు. అదే స్ఫూర్తితో ఉత్సాహంగా పనులు చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి సోమవారం రెండు శాఖలు ప్రజలు అసంతృప్తి చెందిన అంశాలు, రీఓపెన్‌ అయిన కేసులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. స్పందన ఈకేవైసీపై శాఖల వారీగా వారం వారం సమీక్ష నిర్వహిస్తామని, వేలిముద్రలు, ఐరీస్‌ పడని వారికి సంబంధిత ఎంపీడీవో, తహసీల్దార్ల నుంచి డేటా సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా సమీక్షకు చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గైర్హాజరు కావడంతో షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-10-30T23:33:45+05:30 IST