టీడీపీ సంబరాలు
ABN , First Publish Date - 2023-11-21T00:14:29+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

చంద్రబాబుకు బెయిల్.. తమ్ముళ్లలో జోష్
కర్నూలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. న్యాయమే గెలిచింది.. సుప్రీం కోర్టులో కూడా చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. వాడవాడలో, పల్లె పల్లెలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. సోమవారం కర్నూలులోని స్థానిక గాయత్రి ఎస్టేట్ సర్కిల్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తదితర టీడీపీ నాయకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల నాగేంద్ర, ఎస్కే బషీర్ తదితరులు హాజరయ్యారు. మంత్రాలయంలో టీడీపీ ఇన్చార్జి తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసరెడ్డి, తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి నరవ రమాకాంతరెడ్డి, బూదూరు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి, మంచాలమ్మ దేవతకు 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. రాఘవేంద్ర సర్కిల్లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు సోమప్ప సర్కిల్లో బాణసంచా కాల్చారు. పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో టీడీపీ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రమోద్కుమార్రెడ్డి, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఆలూరు, ఆస్పరి, ముులుగుందం గ్రామాల్లో సంబరాలు జరపుకున్నారు. కోడుమూరు ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్, గూడూరు మండలం కన్వీనర్ ఎల్.సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యుడు బస్తిపాటి కురువ నాగరాజు ఆధ్వర్యంలో, పుసుపుల గ్రామంలో కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నాయకుడు బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు. బి. తాండ్రపాడు గ్రామంలో, గూడూరులో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు.