చిరుధాన్య ఉత్పత్తిని ప్రోత్సహించాలి - కలెక్టర్
ABN , First Publish Date - 2023-02-02T00:19:38+05:30 IST
పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన వ్యవసాయాధికారులను ఆదేశించారు.
నంద్యాల టౌన, ఫిబ్రవరి 1 : పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన వ్యవసాయాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఈ-క్రాప్ బుకింగ్, చిరుధాన్యాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించడంపై వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుకు నీటి అవసరం తక్కువ అని, దిగుబడి బాగా ఉంటుందని రైతుల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. రబీ సీజనకు పెండింగ్లో ఉన్న 9 శాతం ఈ-క్రాప్ బుకింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా పీఎం కిసాన పెండింగ్లో ఉన్న 27,024 మంది రైతుల ఈ-కేవైసీని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఈ సమీక్షలో జేసీ నిశాంతి, జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు, డీఎస్వో ఆచార్యులు, నంద్యాల ఏడీఏ రాజశేఖర్, డోన ఏడీఏ అశోక్వర్థనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.