స్పందన అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-02-06T23:41:58+05:30 IST
స్పందన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల (నూనెపల్లె), ఫిబ్రవరి 6 : స్పందన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిశాంతి వినతులు స్వీకరించారు. అనంతరం సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది ముఖ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. స్పందనలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు ప్రత్యేకదృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతివారం 2వేలకు పైగా దరఖాస్తులు వస్తున్నాయని, ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో సరైన కారణాలు వివరిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా ఎండార్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో పుల్లయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీసు స్పందనకు 69 ఫిర్యాదులు
నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పోలీసు స్పందనకు 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను వివరంగా అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ రమణ, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజినాయక్, డీఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.