భరోసా కేంద్రానికి తాళం
ABN , First Publish Date - 2023-05-26T23:31:25+05:30 IST
భరోసా కేంద్రానికి తాళం

మూడేళ్లుగా అద్దె చెల్లించలేదని ఆగ్రహిచిన యజమాని
పగిడ్యాల, మే 26: పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవనానికి యజమాని శుక్రవారం తాళం వేశారు. గ్రామానికి చెందిన చిన్న మాబు అనే వ్యక్తి ఇంట్లో నాలుగేళ్లుగా రైతుభరోసా కేంద్రం నడుస్తోంది. యజమాని మాబుకు నెలకు రూ. 3600 అద్దె చెల్లించేలా అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగున్నరేళ్లలో నాలుగు విడుతలుగా ఏడాది బాడుగ రూ. 49,500 బ్యాంకు ఖాతాలో జమ చేశారని, మిగిలిన మూడేళ్ల అద్దె చెల్లించలేదని, అందుకే తాళం వేస్తున్నానని చిన్న మాబు తెలిపారు. అద్దె ఇవ్వమని వ్యవసాయ సిబ్బందిని అడిగితే అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. అద్దె వస్తే కుటుంబ పోషణకు ఆసరాగా ఉంటుందని, తాము రేకుల షెడ్డులో ఉంటూ ఇల్లు రైతుభరోసా కేంద్రానికి ఇచ్చానని, అయితే అధికారులు బాడుగ ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి విజయ్ జ్యోత కుమార్ని వివరణ అడుగగా.. మండలవ్యాప్తంగా ఉన్న రైతుభరోసా కేంద్రాలకు 14 నెలల అద్దె చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే ఇస్తామని అన్నారు.