ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి: ఏపీటీఎఫ్
ABN , First Publish Date - 2023-06-03T00:01:36+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పాఠశాల సహాయకులు తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు.
నంద్యాల టౌన్, జూన్ 2: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పాఠశాల సహాయకులు తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. శుక్రవారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో తెలుగు, హిందీ పాఠశాల సహాయకుల ఖాళీలను బ్లాక్ చేయకుండా, అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. తెలుగు, హిందీ సబ్జెక్టుల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నందున నూతనంగా మంజూరైన పాఠశాల సహాయకుల పోస్టులను ఆ పాఠశాలలకు కేటాయించడం లేదని, దీనివల్ల తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు తక్కువ ఖాళీలు ఉండడం వల్ల సుదీర్ఘకాలంగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తెలుగు 410, హిందీ 206పోస్టులను అప్గ్రేడ్ చేసి అడ్హాక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించారని, డిసెంబర్ 2020లో జరిగిన బదిలీల్లో వారి స్థానాలు ఖాళీ చూపించకుండా, ఆ ఖాళీలను వారికే శాశ్వతంగా కేటాయించారని, దీంతో సీనియర్ తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పుల్లయ్య, పవన్కుమార్, మునిస్వామి, వెంకటేశ్వర్లు, గోపాల్రావు, మద్దిలేటి పాల్గొన్నారు.