ప్రజా సంక్షేమంలో జగన్ విఫలం
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:38 AM
గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 28: గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బీటీ నాయుడు, బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంక టేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్ వైసీపీ ప్రభుత్వ ఫెయిల్యూర్ వివరాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా బీటీ నాయుడు మాట్లాడుతూ నవరత్నాలు, నవమోసాలు మేనిఫెస్టోలో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో 85 శాతం విపలమయ్యారని విమర్శించారు. నవరత్నాల మేనిఫెస్టోలో పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 730 దాకా ఉన్నాయని, వాటిల్లో కేవలం 21 హామీలను మాత్ర మే అమలు చేశారన్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజల దగ్గర్నుంచి ఉద్యో గులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు నిర్వహిస్తుంటే.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా సీఎం జగన్ రెడ్డి తనకు తాను ఘనమైన చరిత్ర కలిగిన ఆదర్శ పాలకుడుగా చాటింపు వేయించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో జగన్కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.