దాహం తీరే దారేదీ..?

ABN , First Publish Date - 2023-05-26T00:18:28+05:30 IST

మంత్రి గుమ్మనూరు జయరాం ఇలాఖాలో ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు.

దాహం తీరే దారేదీ..?
మినీ ట్యాంక్‌ వద్ద తాగునీటి కోసం గ్రామస్థుల పాట్లు

పది రోజులకోసారి తాగునీరు సరఫరా

మినీ ట్యాంకుల వద్ద నీటి కోసం పాట్లు

మంత్రి ఇలాఖాలో అవస్థలు

ఆదోని, మే 25: మంత్రి గుమ్మనూరు జయరాం ఇలాఖాలో ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తుం డడంతో ట్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామంలో 4,555 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఎనిమిది చేతి పంపులు ఉన్నా ఉప్పు నీరు కావడంతో తాగటానికి ఉపయోగపడడం లేదు. దీంతో ఆ గ్రామానికి బాపురం స్కీం నుంచి మంచినీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవి ప్రారంభ మైనప్పటి నుంచి పది రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. దీంతో నీటిని పట్టుకునేందుకు మినీ ట్యాంకర్ల పైకి ఎక్కి పైపుల ద్వారా బిందెలకు పట్టుకుంటున్నారు. ట్యాంకు నుంచి బిందెలను ఇంటికి తీసుకుపోవడానికి ప్రత్యేకంగా ఒక ట్రాలీని సైతం తయారు చేసుకున్నారు. ఆలూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి తాగునీటిని అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న విమ ర్శలున్నాయి. కార్మిక శాఖ మంత్రి ఇలాఖాలోనే ఇలా ఉందంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఎవరికి చెప్పుకోవాలో..

తాగునీరు వచ్చిందంటే మా గ్రామానికి పండగే. నీటి కోసం చేయమని ఎవరి కి చెప్పుకోవాలో.

- మల్లికార్జున, హత్తిబెళగల్‌, ఆలూరు మండలం

తాగునీటి కష్టాలు తప్పడం లేదు

తాగునీరు వచ్చిందంటే చాలు... బిందెలతో ట్యాంకర్ల దగ్గర బారులు తీరాల్సిందే. మినీ ట్యాంకర్‌ పైకి ఎక్కి పైపుల ద్వారా నీరు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేనిపక్షంలో తాగునీరు దొరుకుతుందో లేదోనన్న భయం. అందుకే ట్యాంకర్ల దగ్గరకు ఉరుకులు, పరుగులు పెడతాం.

- మౌనిక, గృహిణి, హత్తిబెళగల్‌

Updated Date - 2023-05-26T00:18:28+05:30 IST