జగనన్న కాలనీలో ఎక్కడి పనులు అక్కడే
ABN , First Publish Date - 2023-07-16T23:25:43+05:30 IST
మండల కేంద్రం వెల్దుర్తికి 2 కిల్లోమీటర్ల దూరంలో తిప్పపైన జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు.
పూర్తయిన ఇళ్లు 30 శాతమే
జిల్లాలో 7500 ఇళ్లు రద్దు
కొండలు, గుట్టలపై కాలనీల ఏర్పాటు
ముందుకు రాని లబ్ధిదారులు
కర్నూలు(ఎడ్యుకేషన్), జూలై 16
మండల కేంద్రం వెల్దుర్తికి 2 కిల్లోమీటర్ల దూరంలో తిప్పపైన జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. 208 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కేటాయించారు. మట్టి రోడ్డు, కరెంట్, నీటి సౌకర్యాలు కల్పించారు. సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇంటికి కూడ పునాది రాయి పడలేదు. ఊరికి దూరంగా ఉండడంతో ఇళ్ళు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు మందుకు రావడంలేదు.
కల్లూరు మండలంలోని బొల్లవరం గ్రామానికి 3 కిల్లో మీటర్లు దూరంలో బస్తిపాడుకు పోయే మార్గంలో జగనన్న కాలనిలో లే ఆవుట్ వేశారు. ఇందులో 42 ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. లబ్ధ్దిదారుల ఎంపిక కూడ పూర్తయింది. గృహలు కట్టుకోవడానికి కరెంట్, నీటిసౌకర్యం కల్పించారు. మట్టి రోడ్లు వేసి సిద్ధం చేశారు. లే అవుట్లోని 42 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. వీరికి ఇళ్ళు మంజూరైన సంతోషం నిల్వ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేపట్టిన వైఎ్సఅర్ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల పనులు కర్నూలు జిల్లాలో నత్తనడకన కొనసాగుతున్నాయి. కొండలు, గుట్టలు, నీటి గుంతల్లో లేఅవుట్లు వేయడం, అవి కూడ అవాసాలకు దూరంగా ఉండడంతో ఇళ్ళు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఇష్టపడడం లేదు. ఈ లేఅవుట్లకు వెళ్ళడానికి సరైన రహదారులు కూడ వేయలేదు. విద్యుత్తు, కరెంట్ నీరు ఇంటర్నల్ రోడ్లు వంటివి ఏర్పాటు చేయలేదు. కనీస వసతులు కల్పించకుటే ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు నిలదీస్తుండడంలో అధికారులను బిక్క ముఖాలు వేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 364 జగనన్న కాలనీల్లో 39,331 ఇళ్ళు మంజూరు అయ్యాయి. ఈ నాలుగేళ్ళల్లో మంజూరైన ఇళ్ళల్లో ఇప్పటి వరకు పూర్తి చేసినది కేవలం 13,905 ఇళ్ళు మాత్రమే. ఆర్సీ దశలో 1188, రూప్ లెవెల్లో 1977, బేస్మెంట్ స్థాయిలో 10,513, బీబీఎల్ స్థాయిలో 11,748 ఉన్నాయి. ఇవి కాక, మూడో అప్షన్ కింద 11,178 ఇళ్ళను కేటాయించారు. ఈ పనులను ప్రభుత్వమే నేరుగా టెండర్లను వేసి కాంట్రాలకు అప్పగించారు. ఈ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మండలస్థాయి అధికారులకు ఇంటి పనుల బాధ్యతలు అప్పగించినా పనులు ముందుకు సాగడం లేదు. దీనంతటికి కారణం ఒక్కో ఇంటికి కేవలం రూ.1.80 లక్షలు మంజూరు చేయడమే. ఈ డబ్బు ఇంటి పనికి సరిపోవని, అప్పులపాలు కావల్సి వస్తోందని లబ్ధిదారుల అవేదన చెందుతున్నారు.
జిల్లాలో 7500 ఇళ్లు రద్దు
కర్నూలు జిల్లాల్లో మంజూరు చేసిన 7500 ఇళ్లును రద్దు చేశారు. నాన్ స్టాడింగ్ ఇళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన ఇళ్ళను అమరావతికి తరలించినట్లు అరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదలు పెట్టని గృహలను మరికొన్నింటిని రద్దు చేసే అలోచనలో అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొండలు, గుట్టలు, నీటి గుంతలో లే ఆవుట్లు
జిల్లాలోని వైఎ్సఅర్ జగనన్న కాలనీలు లే ఆవుట్లు నివాసానికి అమోదం కాని చోట లే ఆవుట్లు వేశారు. రవాణా సౌకర్యాలే కాదు, కదా, రోడ్డు మార్గాలే లేవు. కాలనీల్లో ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. కనీస సౌకర్యాలను కల్పించడంలో జిల్లా గృహ నిర్యాణ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
జిల్లాల్లో 784 ఇళ్లు మాత్రమే రద్దు
జిల్లాలో 784 ఇళ్లు మాత్రమే రద్దు అయ్యాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ ఇళ్లు కర్నూలులోనే. 29 ఇళ్ళు మొదలు కాలేదు. బీబీఎల్ స్థాయిలో ఉన్న 11855 ఇళ్ల లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చాం. త్వరలో ఇళ్ళు పూర్తి అయ్యేల్లా చర్యలు తీసుకుంటున్నాం.
- జిల్లా హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు: సి. నాగరాజు