చంద్రన్న కోసం పోరు
ABN , First Publish Date - 2023-09-26T00:42:08+05:30 IST
‘చంద్రన్నకు తోడుగా మేమున్నాం.. ఆయన విడుదలయ్యే వరకు మా ఉద్యమం ఆగదు..

13వ రోజు జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల రిలే దీక్షలు
కర్నూలులో నల్ల బెలూన్లు గాలిలోకి వదిలి నిరసన
కర్నూలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రన్నకు తోడుగా మేమున్నాం.. ఆయన విడుదలయ్యే వరకు మా ఉద్యమం ఆగదు.. మరింత ఉధృతం చేస్తాం’ అని టీడీపీ ఆందోళనలను మరింత తీవ్రం చేస్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 13వ రోజు సోమవారం జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు, వివిధ రూపాల్లో కొనసాగాయి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద ధర్నా చౌక్లో టీడీపీ కర్నూలు నియోజకవర్గం ఇన్చార్జి టీజీ భరత్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ ఎస్.అబ్బాస్, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలు మంతాజ్బేగం తదితరులు రిలే దీక్షలకు హాజరయ్యారు. కృష్ణదేవరాయల విగ్రహం వరకు ఊరేగింపు చేసి ఆకాశంలోకి నల్ల బెలూన్లు వదిలారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలపారు. కోడుమూరు పాత బస్టాండ్ సర్కిల్లో టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు చంద్రబాబు కోసం దీక్ష చేపట్టారు. మాజీ సర్పంచి సీబీ లత, కోడుమూరు, గూడూరు మండలాల పార్టీ కన్వీనర్లు కోట్ల కవితమ్మ, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. పత్తికొండలో టీడీపీ ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా ముఖ్య నాయకులు తిరుపాల్ సారథ్యంలో ఆ విభాగం నాయకులు దీక్షలో కూర్చుకున్నారు. జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, పార్టీ సీనియర్ నాయకుడు సాంబశివారెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ చేపట్టిన కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి సీఎం జగన్ ఓర్వలేక రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని.. ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు మెడకు ఉరి తాళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతినాయుడు, బస్సాపురం రామస్వామి, దొడ్డనకేరి శివప్ప, శ్రీనివాస ఆచారి, మాజీ కౌన్సిలరు రంగన్న తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆలూరులో పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, ఆస్పరి మండల కన్వీనర్ పరమరెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి సులోచనరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మురళీరెడ్డి తదితరులు దీక్షల్లో కూర్చుకున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ కేసులు పెట్టారని కోట్ల సుజాతమ్మ విమర్శించారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో ఆ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు డబ్బా ఈరన్న సహా 35 మంది, పట్టణానికి చెందిన కార్యకర్తలు కూర్చుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరిస్తూ బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రధాన రోడ్లల్లో తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఆ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి పి. తిక్కారెడ్డి ఆధ్వర్యంలో 13వ రోజు దీక్షల్లో మంత్రాలయం మండలానికి చెందిన టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ లెవల్ ఇన్చార్జిలు కూర్చుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్యాలకుర్తి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గం పరిశీలకురాలు శివబాల తదితరులు హాజరు అయ్యారు.