పాలకుల విధానాలపై పోరాడాలి
ABN , First Publish Date - 2023-11-19T23:34:22+05:30 IST
మహిళా సమాజం పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య, నిర్లిప్త విధానాలను నిరసిస్తూ ఎదురొడ్డి పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని అన్నారు.

మహిళలు మార్గదర్శకులుగా మారాలి
ఏపీ మహిళా సమాఖ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని
ముగిసిన ఏపీ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలు
నంద్యాల టౌన్, నవంబరు 19 : మహిళా సమాజం పట్ల పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య, నిర్లిప్త విధానాలను నిరసిస్తూ ఎదురొడ్డి పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని అన్నారు. ఆదివారం నంద్యాలలో జరుగుతున్న ఏపీ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలలో భాగంగా మూడో రోజు ముగింపు సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలి వచ్చిన మహిళా సమాఖ్య ప్రతినిధుల నుద్దేశించి దుర్గా భవాని ప్రసంగించారు. మహిళలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలంతా మార్గదర్శకులుగా మారాలని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి రాకమునుపు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చలేదని విమర్శించారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఆ మాటే మరిచిందన్నారు. వైసీపీ నాయకులు, తమ సొంత బ్రాండ్లతో రూ.లక్షల కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వలసలను నివారించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మహిళా సమాఖ్య హక్కుల కోసం పోరాడే మహిళా సమాజానికి మొత్తం అండగా ఉంటుందని, ప్రభుత్వ మెడలు వంచేలా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా భవిష్యత్తు పోరాటా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని దుర్గా భవాని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు రావాలి అని అన్నారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభల ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలపై దౌర్జన్యాలు పెరిగిపో యాయని, పసికూన నుంచి వృద్ధులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడంలో పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, జాతీయ నాయకురాళ్లు అక్కినేని వనజ, సంధ్యాకుమారి, యామిని, విమల, దుర్గాంబ, జిల్లా కార్యదర్శి సుగుణాంబ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ప్రజానాట్యమండలి, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐటీయూసీ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.