గర్భిణులకు నులిపురుగుల నివారణ మాత్రలు
ABN , First Publish Date - 2023-03-18T00:13:13+05:30 IST
ప్రతి గర్భిణీకి ఆల్బెండజోల్ 400 ఎంజీ నులి పురుగుల మాత్రను మింగించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై.ప్రవీణ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.

జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై.ప్రవీణ్ కుమార్
కర్నూలు(హాస్పిటల్), మార్చి 17: ప్రతి గర్భిణీకి ఆల్బెండజోల్ 400 ఎంజీ నులి పురుగుల మాత్రను మింగించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.వై.ప్రవీణ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని శరీన్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఐవో తనిఖీ చేశారు. శరీరంలోని అనేక అసమానతలకు రుగ్మతలకు ఈ మాత్రలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. నులిపురుగులు ఉంటే శరీరంలో తెల్లగా పొలిపోవడం, చేతులు కాళ్లలో విపరీతమైన దురద వస్తుందన్నారు. శరీరంలో ఎక్కడైనా చర్మంపై అలర్జీ వస్తుందని హెచ్చరించారు. నులిపురుగుల నివారణకు వ్యక్తిగత మరుగుదొడ్లును వాడా లని, ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రం పరుచుకోవాలన్నారు. ప్రతి ఆదివారం విద్యార్థులు గోళ్లు కత్తిరించుకుని, ఆహార పదార్థా లపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. పండ్లు, కూరగాయలు, మాంసం మొదలగు పదార్థాలను బాగా ఉడికించి తినాలన్నారు. కార్యక్రమంలో శరీన్నగర్ పట్టణ ఆరోగ్య వైద్యాధికారి డా.ఫర్హీన్ తబస్సుమ్, సచివాలయ ఏఎన్ఎం కళ్యాణి, ఎస్వో హేమసుందర్, ఆశా కార్యకర్త శివకుమార్ పాల్గొన్నారు.