ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి: డీఈవో
ABN , First Publish Date - 2023-03-26T00:06:20+05:30 IST
ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈవో అనూరాధ ఆదేశించారు.
నంద్యాల (నూనెపల్లె), మార్చి 25: ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈవో అనూరాధ ఆదేశించారు. శనివారం నంద్యాలలో పరీక్షల ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30గంటల వరకు ఓపన్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో అపాస్ 10వ తరగతి పరీక్షలకు 6 పరీక్షా కేంద్రాలలో 1149 మంది విద్యార్థులు, అపాస్ ఇంటర్మీడియట్ పరీక్షలకు 8పరీక్షా కేంద్రాలలో 1653 మంది విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులతోపాటు సెల్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. పరీక్ష నిర్వహించే సిబ్బందికి కూడ మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, డీఈసీ మెంబర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.