ముక్కోటి మహద్భాగ్యం
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:16 AM
ధనుర్మాసంలో విచ్చేసే వైకుంఠ ఏకాదశి వేడుకను జిల్లాలోని వైష్ణవ భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
భక్తజనంతో కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు
‘ఉత్తర ద్వారం’ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం
కర్నూలు(కల్చరల్), డిసెంబరు 23: ధనుర్మాసంలో విచ్చేసే వైకుంఠ ఏకాదశి వేడుకను జిల్లాలోని వైష్ణవ భక్తులు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలను ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. అలంకార ప్రియుడైన విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. ఆలయాలకు విభిన్న రంగుల పుష్పాలతో తోరణాలు కట్టి ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. స్వామి వారి దర్శనానికి ప్రత్యేకంగా ‘ఉత్తర ద్వారాల’ను అరటి బోదెలు, మామిడి తోరణాలు, పుష్పమాలలతో తీర్చిదిద్దారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆయా ఆలయాల్లో వేకువజాము నుంచే స్వామి అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసాలు, వ్రతాలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల్లోని ఆలయాల వద్ద భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. షామియానాలు ఏర్పాటు చేసి, తాగునీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు.