అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ లబ్ధి
ABN , First Publish Date - 2023-06-02T01:02:55+05:30 IST
రైతులను అన్నివిధాల ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాయని కృష్ణా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ఐదో ఏడాది తొలివిడత రైతుభరోసా, పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో స్థానిక కాకర్ల కన్వెషన్ హాల్లో గురువారం నిర్వహించారు.
ఉయ్యూరు, జూన్ 1 : రైతులను అన్నివిధాల ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాయని కృష్ణా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ఐదో ఏడాది తొలివిడత రైతుభరోసా, పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో స్థానిక కాకర్ల కన్వెషన్ హాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 1,55,004 మంది రైతులకు రూ. 116.25 కోట్ల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతుంద న్నారు. రైతుభరోసాకేంద్రాల ద్వారా రైతులకు అన్నింటిని సమకూర్చుతున్నామని, ఈ- క్రాప్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు సంక్షేమం, అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని పెనమలూరు ఎమ్మ్లెల్యే కొలుసు పార్ధసారథి అన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులు ఏవిధమైన ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రైతుల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ముఖ్యమంత్రి రైతుభరోసా, పీఎం కిసాన్ విడుదల కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్ర్కీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి, ఉద్యాన శాఖాధికారి జ్యోతి, పశుసంవర్ధక అధికారి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ ఏడీ మణిధర్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ జన్నురాఘవరావు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తాతినేని పద్మావతి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 127954 మందికి రూ.95.96కోట్లు
కలెక్టరేట్, జూన్ 1 : జిల్లాలో ఈ ఏడాది తొలి విడత కింద రైతులకు ఆర్ధిక భరోసా నగదు అందజేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్సార్ రైతుభరోసా ద్వారా ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలో జమ చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ దిల్లీరావు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం జిల్లాకు చెందిన రైతులకు చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది మొదటి విడత కింద 127954 మంది రైతులకు రూ.95,96,55,000 ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకు పెట్టుబడి సహాయంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలందించడం జరిగుతుందన్నారు. తొలుత రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయం, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ పరిశీలించారు.