కేంద్ర బృందానికి ఏం చూపిస్తారు?

ABN , First Publish Date - 2023-06-03T01:19:27+05:30 IST

‘‘పొందుగలలో నాలుగు నెలలుగా జలజీవన్‌ మిషన్‌ పనులు చేస్తున్నారు. ఒక్క కుళాయినైనా ఎందుకు ఏర్పాటు చేయలేదు.’’ అని ఎన్టీఆర్‌ జిల్లా అధికారులపై పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర బృందానికి ఏం చూపిస్తారు?
అధికారులతో మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌

నాలుగు నెలల నుంచి ఒక్క కుళాయి కనెక్షనైనా ఇవ్వలేదా

పొందుగలలో జలజీవన్‌ మిషన్‌ పనుల పరిశీలనలో అధికారులపై పంచాయతీరాజ్‌ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ అసహనం

మైలవరం రూరల్‌, జూన్‌ 2: ‘‘పొందుగలలో నాలుగు నెలలుగా జలజీవన్‌ మిషన్‌ పనులు చేస్తున్నారు. ఒక్క కుళాయినైనా ఎందుకు ఏర్పాటు చేయలేదు.’’ అని ఎన్టీఆర్‌ జిల్లా అధికారులపై పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అసహనం వ్యక్తం చేశారు. పొందుగలలో మరికొన్ని రోజుల్లో కేంద్ర కార్య దర్శి, బృందం జలజీవన్‌ పనుల పరిశీలనకు రానున్న నేపథ్యంలో శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి గ్రామంలో ఆయన పర్యటించారు. నూతనంగా నిర్మించిన రక్షిత నీటి పథకం ట్యాం కును పరిశీలించారు. అక్కడ నుంచి నివాసాలకు ఏర్పాటు చేసిన కుళాయిలను పరిశీలించేందుకు వెళ్లగా ఒక్క ఇంటిలోనైనా కొత్త కనెక్షన్‌ ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందానికి ఇదే చూపిస్తారా అని ప్రశ్నించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఊరిలో ఎన్ని కనెక్షన్లు ఇస్తున్నారు? ఫ్లోరైడ్‌ సమస్య ఉందా? జలజీవన్‌ మిషన్‌ కింద ఏఏ పరీక్షలు చేసి నీరు సరఫరా చేస్తారో చెప్పాలని పారిశుధ్య కమిటీ సభ్యులను నిలదీశారు. దీనికి కమిటీ సభ్యులు సరైన సమాధానం చెప్పకపోవడంతో పారిశుధ్యం, రక్షిత మంచి నీటి సరఫరాపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. శాశ్వత డ్రెయినేజీని నిర్మించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. సీఈ గాయత్రీదేవి, ఈఎన్‌సీ కృష్ణారెడ్డి, హరి రామానాయక్‌, ఎస్‌ఈ డి.వెంకట రమణ, సర్పంచ్‌ కోటమ్మ, ఎంపీపీ ప్రసన్నరాణి, జడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T01:19:27+05:30 IST